ఐసిస్‌లో మరో నలుగురు రాష్ట్రవాసులు! | Sakshi
Sakshi News home page

ఐసిస్‌లో మరో నలుగురు రాష్ట్రవాసులు!

Published Thu, Jan 28 2016 4:23 AM

The four state residents in Isis!

సాక్షి, హైదరాబాద్: ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ సభ్యులనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేసిన నలుగురు నగరవాసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో పట్టుబడిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు కోర్టు అనుమతితో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురితో సన్నిహిత సంబంధాలు కలిగి నట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరు హైదరాబాదీలు ఫయాజ్, అర్ఫాన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

వీరిద్దరూ జపాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు వీసాలు సైతం తీసుకున్నారని అధికారులు అంటున్నారు. ఆ దేశ కాన్సులేట్‌తో పాటు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు వీరి కోసం వేట ముమ్మరం చేశారు. మరోపక్క తెలంగాణకు చెందిన నలుగురు ఇప్పటికే సిరియా చేరుకున్నట్లు ‘ఆ నలుగురూ’ వెల్లడించారు. అర్షద్ అలీ అనే యువకుడు 4 నెలల క్రితం సింగపూర్‌కు వెళ్లాడని, అక్కడ నుంచి అక్రమంగా సిరియా చేరుకున్నట్లు స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఖాదిర్ అనే యువకుడూ రెండు నెలల క్రితం సిరియాకు వెళ్లిపోయినట్లు బయటపెట్టారు. ఆన్‌లైన్, సోషల్‌మీడియా ద్వారా వీరు తమతో సంప్రదింపులు జరిపేవారని నఫీజ్ అంగీకరించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నగరవాసులు కూడా సిరియాకు చేరుకున్నట్లు తమకు తెలుసని ‘ఆ నలుగురు’ నిందితులు వెల్లడించడంతో వారి వివరాలు ఆరా తీయడంపై నిఘా, పోలీసు వర్గాలు దృష్టి పెట్టాయి.

Advertisement
Advertisement