యూరప్‌లో చిక్కిన జంట పేలుళ్ల నిందితుడు ఖాన్? | Khan accused involved in the twin explosions in Europe? | Sakshi
Sakshi News home page

యూరప్‌లో చిక్కిన జంట పేలుళ్ల నిందితుడు ఖాన్?

Aug 26 2014 12:11 AM | Updated on Sep 2 2017 12:26 PM

హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాది మహ్మద్ అమీర్ రజా ఖాన్..

హుటాహుటిన వెళ్లిన భారత నిఘా వర్గాలు  
ఖాన్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు  
వారం క్రితమే అదుపులోకి

 
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన జంట పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాది మహ్మద్ అమీర్ రజా ఖాన్.. యూరప్ పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. 2005 ఆగస్టు 25న జరిగిన ఈ విధ్వంసంలో 42 మంది మృతి చెందారు. మరో వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ కేసులో అమీర్ రజా ఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న అమీర్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారం క్రితం యూరప్‌లో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న భారత నిఘా బృందం హుటాహుటిన బయలుదేరి వెళ్లింది.

నేరమయ జీవితం..:  కోల్‌కతాకు చెందిన అమీర్ రజా గుజరాత్‌లో మాఫియా కార్యకలాపాల ద్వారా నేరాల బాటపట్టాడు. 2001లో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త పార్థోను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. ఏఆర్‌డీఎఫ్ సంస్థను స్థాపించిన అమీర్.. కొందరు యువతను సమీకరించి పోలీసులపై ప్రతీకారానికి పురిగొల్పాడు. నగదు కోసం బెదిరింపులు, కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు.  2002లో అఫ్తాబ్ అన్సారీతో కలిసి కోల్‌కతాలో ఉన్న అమెరికన్ సెంటర్‌పై దాడి చేశాడు.  2003లో రియాజ్ భత్కల్, సాదిక్ ఇష్రార్ షేక్‌లతో(గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల సూత్రధారులు) కలసి ఇండియన్ ముజాహిదీన్‌ను స్థాపించాడు. 2005లో హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు మరికొన్ని ఉగ్రవాద చర్యల్లోనూ అమీర్ పేరు వెలుగులోకి రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ మరికొన్ని కేసులను రెడ్‌కార్నర్ నోటీసులో జత చేసింది.  ముంబై దాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు అందించిన మోస్ట్‌వాంటెడ్ జాబితాలోనూ అమీర్ పేరు ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement