పోస్టుమెట్రిక్‌ ఉపకారానికి బయోమెట్రిక్‌ | Biometric for Postmutric Supplement | Sakshi
Sakshi News home page

పోస్టుమెట్రిక్‌ ఉపకారానికి బయోమెట్రిక్‌

May 20 2017 2:19 AM | Updated on Sep 5 2018 9:18 PM

పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరులో బయోమెట్రిక్‌ పద్ధతి కీలకం కానుంది.

- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన పథకాల్లో వేలిముద్రల హాజరే కీలకం
- నేరుగా హాజరు స్వీకరించే సర్వర్‌తో ఈపాస్‌కు లింకు


సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరులో బయోమెట్రిక్‌ పద్ధతి కీలకం కానుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, అర్హతల నిర్ధారణ అంతా ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థుల హాజరు ప్రక్రియ మాన్యువల్‌గా కొనసాగుతోంది. దీంతో కొందరు విద్యార్థులు నెలల తరబడి కాలేజీకి హాజరు కాకున్నా స్కాలర్‌షిప్‌లు కాజేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల హాజరును పూర్తిగా బయోమెట్రిక్‌ పద్ధతిలో తీసుకోవాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రతి కాలేజీలో బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీలు తెరిచే నాటికి ఈ మిషన్లు అమర్చాలని యంత్రాంగం ఒత్తిడి పెంచుతోంది.

విద్యార్థి హాజరుశాతం 75 దాటితేనే...
కాలేజీ విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం దాటితేనే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు అర్హత సాధించవచ్చు. సంక్షేమ శాఖలు ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌ ధ్రువీకరణ ఆధారంగా విద్యార్థి హాజరు శాతాన్ని పరగిణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బయోమెట్రిక్‌ పద్ధతిని అమల్లోకి తెస్తే ప్రిన్సిపాల్‌ ధ్రువీకరణ అవసరం లేదు. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల పర్యవేక్షణను సంక్షేమశాఖలు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తున్నాయి. తాజాగా బయోమెట్రిక్‌ పద్ధతిలో హాజరు తీసుకోవాలని నిర్ణయించిన సర్కారు ఈ హాజరు రికార్డును ఈపాస్‌లో నమోదు చేసేలా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బయోమెట్రిక్‌ మిషన్లకు అనుసంధానంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఈపాస్‌తో అనుసంధానం చేయనున్నారు. ఈ పద్ధతితో విద్యార్థుల హాజరుశాతం రోజూ వెబ్‌సైట్‌లో నమోదు కావడంతోపాటు ఆటోమెటిక్‌గా ఆయా పథకాలకు విద్యార్థి అర్హత తేలుతుందని, దీర్ఘకాలికంగా కాలేజీకి గైర్హాజరయ్యే విద్యార్థి పేరు బ్లాక్‌ అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కరుణాకర్‌ అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న కాలేజీలు: 6,843
ప్రైవేటు కాలేజీలు : 5,550
ప్రభుత్వ కాలేజీలు : 1,293
మొత్తం విద్యార్థుల సంఖ్య: 13.67 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement