వచ్చే నెల 3వ తేదీన జరగబోయే పోలీస్ ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షకు 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.
హైదరాబాద్ : వచ్చే నెల 3వ తేదీన జరగబోయే పోలీస్ ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షకు 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మొత్తం 9,281 కానిస్టేబుళ్ల పోస్టులకు గాను 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అలాగే 539 ఎస్సై పోస్టులకు 1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు.
ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతోపాటు ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. జేఎన్టీయూ సహకారంతో పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచీలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోరని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షలు జరిగే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.