పోలీసులే వేధిస్తున్నారు.. రక్షించండి | application in sp grievence | Sakshi
Sakshi News home page

పోలీసులే వేధిస్తున్నారు.. రక్షించండి

Feb 6 2018 12:11 PM | Updated on Feb 6 2018 12:11 PM

గుంటూరు : జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ జరిగింది. డీసీఆర్బీ డీఎస్పీ డి.ప్రసాద్‌ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సివిల్‌ వివాదాల్లో పోలీసుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సివిల్‌ వివాదాలు న్యాయస్థానాల్లో మాత్రమే తేల్చుకోవాలని సూచించారు. సమస్యలు కొన్ని బాధితుల మాటల్లోనే...

ఎస్సై నుంచి రక్షణ కల్పించండి..
మా ప్రాంతానికి చెందిన వెంగమ్మ వద్ద అప్పుగా రూ.1.80 లక్షలు తీసుకున్నాను. చెల్లించడంలో కొంత జాప్యం జరిగింది. పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తాను రూ.6 లక్షలు అప్పు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదు చేసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న నేను సమస్యను పోలీసులకు తెలియజేసినా, కొంత సమయం కావాలని కోరినా వినిపించుకోలేదు. పైగా ఎస్సై నన్ను దుర్భాషలాడి కొట్టి పంపించాడు. నా కుమారుడిని కూడా తరచూ స్టేషన్‌కు పిలిపించి డబ్బు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎస్సై నుంచి నాకు, నా కుమారుడికి రక్షణ కల్పించాలి.
– బాదినేడు వెంకటేశ్వరరావు, రాజేష్, తండ్రి కొడుకులు, లక్ష్మీనగర్, గుంటూరు

నా కొడుకు ఆచూకీ తెలపండి..
రెండేళ్ళ క్రితం నా కుమారుడు ఆంజనేయులు కుటుంబంతో కలిసి గోవాలో పనులు చేసుకునేందుకు వెళ్ళాడు. తరచూ ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుపుతూ ఉండేవాడు. కొద్దికాలంగా ఫోన్‌ చేసినా వేరే వ్యక్తులు మాట్లాడుతున్నారు. నాకు పలు అనుమానాలు వస్తున్నాయి. నా కుమారుడి ఆచూకీ గుర్తించి న్యాయం చేయాలి. – ఎ.పద్మ, అశోక్‌నగర్, గుంటూరు

ఉద్యోగం పేరుతో మోసగించారు..
గుంటూరు : ఉద్యోగం పేరుతో మోసపోయమంటూ బాధితులు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌.వెంకటప్పలనాయుడు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలను విన్నవించారు. బాధితులకు న్యాయం జరిగేల చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement