
సమయోచితంగా ఛలోక్తులూ, వ్యంగ్యోక్తులూ విసిరి ఎదుటివారిని నోరెత్తకుండా చెయ్యడంలో గొప్ప ప్రజ్ఞావంతుడు బెర్నార్డ్ షా. అయితే అప్పుడప్పుడు ఆయన కూడా దెబ్బతిన్న సందర్భాలున్నాయి. జి.కె.చెస్టర్టన్కీ షాకీ ఎప్పుడూ పడేది కాదు. షేక్స్పియర్ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన స్ట్రాట్ఫార్డ్ ఎవాన్లో ఆయన నాటక ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ రచయితలంతా ఆ ఉత్సవానికి హాజరయ్యారు. షా కూడా వెళ్లాడు. అక్కడేవున్న చెస్టర్టన్ పలకరించి ‘‘స్వాగతం మిస్టర్ షా. మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఏది ఏమైనా చచ్చిపోయిన సింహం(షేక్స్పియర్) కంటే బతికున్న శునకం మేలు కదా’’ అని వ్యంగ్యంగా ఒక సామెత విసిరాడు. ఆ మాటతో ఏమీ అనలేక కోపంగా వెళ్లిపోయాడు షా. దీని నేపథ్యం ఏమిటంటే, తన నాటకాల్లో నైతిక బోధన ఉంది కాబట్టి షేక్స్పియర్ నాటకాల కంటే తన నాటకాలే గొప్పవని షా అంటూ ఉండేవాడట.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు