వైద్య విద్య... మార్పులు తథ్యం!

Medical education  changes to life - Sakshi

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్‌–2017కు కేబినెట్‌ ఆమోదం

దేశంలో వైద్య విద్యలో సమూల మార్పులకు  రంగం సిద్ధమైంది. యూజీ నుంచి పీజీ  మెడికల్‌ కోర్సుల వరకు.. ఎంట్రీ నుంచి  ఎగ్జిట్‌ పరీక్షల వరకు.. కాలేజీలకు అనుమతి  మొదలు.. ఫీజులపై అధికారాల వరకు.. పలు మార్పులు జరుగనున్నాయి. ఆ దిశగా  నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లుæ–2017కు  డిసెంబర్‌ 15న కేంద్ర కేబినెట్‌ ఆమోద  ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత  ఎన్‌ఎంసీ బిల్లులో ముఖ్యాంశాలు.. ...  దేశంలో  వైద్య విద్యలో  రానున్న మార్పులపై విశ్లేషణ..!

ఎంసీఐ రద్దు
నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు.. నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక  ఆధారంగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ డ్రాఫ్ట్‌ బిల్లుæ–2017ను రూపొందించారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)బిల్లుæ–2017 ప్రకారం– ప్రస్తుతం దేశంలో వైద్య విద్య పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను రద్దు చేసి.. దాని స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)ని ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు అటానమస్‌ బోర్డులు యూజీ, పీజీ మెడికల్‌ విద్య నిర్వహణ; వైద్య కళాశాలల అసెస్‌మెంట్, అక్రిడిటేషన్‌; వైద్య వృత్తి నిపుణుల రిజిస్ట్రేషన్‌ తదితర బాధ్యతలు నిర్వహిస్తాయి. 

నాలుగు బోర్డులు
అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌; మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌; బోర్డ్‌ ఫర్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌. ఇలా.. ప్రత్యేకంగా ఏర్పాటైన నాలుగు బోర్డ్‌ల్లో.. ఒక్కో బోర్డ్‌ ఒక్కో బాధ్యతను నిర్వహిస్తుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సులకు సంబంధించిన బాధ్యతను అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌; పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ పర్యవేక్షిస్తుంది.  మెడికల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, వృత్తి సంబంధిత ఎథిక్స్‌ వంటి అంశాలను బోర్డ్‌ ఫర్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ చూస్తుంది. 

ఎంఏఆర్‌బీయే కీలకం
 ఎన్‌ఎంసీ బిల్లులో పేర్కొన్న నాలుగు బోర్డ్‌లలో.. మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌ పనితీరే కీలకంగా మారనుంది. కళాశాలల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు మొదలు మెడికల్‌ ప్రాక్టీషనర్లకు, మెడికల్‌ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే వరకు.. అన్ని వ్యవహారాలు ఎంఏఆర్‌బీయే చూసుకుంటుంది. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు పనితీరు ఆధారంగా రేటింగ్‌ ఇచ్చే విధానం కూడా ఎంఏఆర్‌బీ చేపట్టనుంది. ఈ రేటింగ్‌ ఆధారంగా విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కాళాశాలను గుర్తించి.. అందులో చేరే వీలుంటుంది.

ప్రాక్టీస్‌కు ముందు పరీక్ష
నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లు–2017 ప్రకారం–వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ విధానం అమల్లోకి వచ్చింది. అలాగే వైద్య కోర్సులు పూర్తిచేసుకొని.. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేపట్టేందుకు ముందుగా జాతీయ స్థాయిలో జరిగే నేషనల్‌ లైసెంటీయేట్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు గ్రాడ్యుయేష¯Œ  స్థాయి వైద్య కోర్సుల్లో పొందిన నైపుణ్యాలను పరిశీలించేలా ఈ పరీక్ష జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్‌ కోర్సులు చదివి.. మన దేశంలో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేయాలనుకంటే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఎన్‌ఎంసీ బిల్లు ప్రకారం– ఇక నుంచి మన దేశంలోని కాలేజీల్లో వైద్య విద్యలో చేరిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న తర్వాత  నేషనల్‌ లైసెంటీయేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

ప్రైవేటు ఫీజులపై స్వేచ్ఛ
ఎన్‌ఎంసీ బిల్లుæ 2017 ప్రకారం– ప్రయివేట్‌ వైద్య కళాశాలలు మొత్తం సీట్లలో 60శాతం సీట్లకు సంబంధించి ఫీజును నిర్ణయించుకునే అధికారం ఆయా కళాశాలల యాజమాన్యాలకు లభిస్తుంది. మిగతా.. 40శాతం సీట్లకు  ఫీజును మాత్రం ఎన్‌ఎంసీ నిర్దేశిస్తుంది. ఎన్‌ఎంసీ నిర్దేశించిన ఫీజుకంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే... భారీ జరిమానా విధించే ఆస్కారముంది.

ఏటా అనుమతులకు స్వస్తి
ప్రస్తుతం ఎంసీఐ నిబంధనల ప్రకారం– కళాశాలలు సీట్లు పెంచుకోవాలన్నా.. కొత్తగా కోర్సులు ప్రవేశ పెట్టాలన్నా.. ప్రతిఏటా ఎంసీఐకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అనుగుణంగా ఎంసీఐ నేతృత్వంలోని నిపుణుల బృందాలు ఆయా కళాశాలల్లో ప్రత్యక్ష తనిఖీలు చేసి.. అనుమతులు మంజూరు చేస్తాయి. ఎన్‌ఎంసీ బిల్లుæ ప్రకారం.. ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. ఇక కళాశాలల ఏర్పాటుకు, గుర్తింపునకు దరఖాస్తు ఒకసారి చేసుకుంటే సరిపోతోంది. ప్రతిఏటా అనుమతుల పునరుద్ధరణ కోసం, సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంసీఐ.. అనుమతుల పునరుద్ధరణ, సీట్ల పెంపు పేరుతో ప్రతిఏటా తనిఖీలు చేయడం.. ఆ క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బిల్లులో తాజా మార్పులు  చేసినట్లు తెలుస్తోంది.

పర్యవేక్షణకు సలహా మండలి
ఎన్‌ఎంసీకి సమాంతరంగా రెండు స్వతంత్ర సలహా మండళ్లు పనిచేస్తాయి. ఐదు మంది సభ్యులతో సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ; 64 మంది సభ్యులు కలిగిన మెడికల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌. సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ ఎన్‌ఎంసీలో ఖాళీల భర్తీ ప్రక్రియను చూస్తుంది. మెడికల్‌ అడ్వైజరీ  కౌన్సిల్‌లో ఎన్‌ఎంసీ సభ్యులతోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధులు ఉంటారు. ఎన్‌ఎంసీ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. మెడికల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ వైద్య రంగంలో వస్తున్న నిరంతర మార్పులు, దానికి అనుగుణంగా అకడమిక్‌గా విద్యార్థు లకు కొత్త నైపుణ్యాలు అందించే క్రమంలో సిలబస్, కరిక్యులంలో ఎప్పటికప్పుడు చేయాల్సిన మార్పులకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది.

ఎన్‌ఎంసీ ముఖ్యాంశాలు
మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) రద్దు
ప్రత్యేకంగా నాలుగు అటానమస్‌ బోర్డ్‌ల ఏర్పాటు
ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సుల మూల్యాంకనకు ఎంఏఆర్‌బీ
ప్రైవేటు కళాశాలల్లో 40 శాతం సీట్లకు ఫీజు నిర్ణయించే అధికారం
కరిక్యులంలో మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాల కోసం మెడికల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌.  

 మేలు చేసే అంశమే
ఎన్‌ఎంసీ బిల్లులోని అంశాలు విద్యార్థులకు మేలు చేసే విధంగానే ఉన్నాయి. అయితే ప్రైవేటు కళాశాలలకు ఫీజుల విషయంలో 60 శాతం సీట్లకు  స్వేచ్ఛ ఇవ్వడం అనే విషయాన్ని పునరాలోచించాలి. ఇక.. ఆయా బోర్డ్‌ల పరిధిలో మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌తోపాటు అనుబంధ రంగాల నిపుణులు కూడా ఉండేట్లు చేస్తే సదరు బోర్డ్‌ల పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది.
– డాక్టర్‌.కె.శ్రీనాథ్‌ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top