విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు | visakha fire accident in biomax-company | Sakshi
Sakshi News home page

విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు

Apr 27 2016 9:36 AM | Updated on Sep 3 2017 10:53 PM

విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు

విశాఖ ప్రమాదంలో అదుపులోకి రాని మంటలు

విశాఖ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

విశాఖపట్నం: విశాఖ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 40 ఫైరింజన్లతో 14 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో పది గంటలు పడుతుందని అధికారులు చెప్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు.

మంగళవారం రాత్రి బయోమాక్స్ కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో మొత్తం 18 ట్యాంకులు ఉండగా..11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. మిగతా ఆరు ట్యాంకులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. సుమారు రూ.200 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. నేవీ హెలికాఫ్టర్తో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు. ఆస్తి నష్టం పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చినరాజప్ప తెలిపారు.  

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ఫ్యాక్టరీ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలో ఉన్న బయో డీజిల్ వల్లే మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని ఫైర్ అధికారులు చెప్పుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement