జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కంబదూరు / రొద్దం : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కువగా తిరిగిన వారు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన రామాంజనేయులు (50) ఆదివారం ఉదయం బంధువుల స్వగ్రామమైన కనగానపల్లికి వెళ్లాడు.
అక్కడి నుంచి బండమీదపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో మధ్యాహ్నం సమయంలో కాలినడకన బయల్దేరాడు. మార్గమధ్యంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దారిలో వెళుతున్న కొందరు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రొద్దం మండలం బూచెర్లలో మహిళా కూలీ నాగమ్మ (55) సోమవారం వడదెబ్బతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.