breaking news
ramanjineyulu
-
టీడీపీ పైశాచికానికి అబల బలి
పచ్చరూప రాక్షసుల పైశాచికానికి మరో అబల బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే.. మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపిన కిరాతకుల దౌష్ట్యానికి నిండుప్రాణం వదిలింది. సీఎం సహాయనిధినీ దక్కకుండా సైంధవుల్లా అడ్డుపడి చనిపోయే వరకు సూటిపోటి మాటలతో రాబందుల్లా పొడిచిపొడిచి బాధించిన దుష్టకూటమి పాలనలో వైద్యం అందక ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైన ఆ మానవతి గురువారం తనువు చాలించింది. సభ్యసమాజాన్ని కలచివేసేఈ హృదయవిదారక ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. కళ్యాణదుర్గం: టీడీపీ మూకల పైశాచికానికి మరో అబల బలైంది. ఏడాదిన్నరపాటు మృత్యువుతో పోరాడి ఆమె కన్నుమూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసముంటున్న చంద్రకళ, చిన్నా దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్ను పడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది.దీంతో రెచ్చి పోయిన రామాంజినేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిన్నర క్రితం చంద్రకళపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమానభారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెకు అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వైద్య ఖర్చులకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఆస్పత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య.. మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి చంద్రకళ పరిస్థితిని తీసుకెళ్లి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. చంద్రకళ (ఫైల్) , పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తూతూ మంత్రంగా కేసు టీడీపీ నేత కుటుంబ సభ్యులు చంద్రకళపై దాడికి పాల్పడినప్పుడు పట్టించుకోని పోలీసులు ఆమె యాసిడ్ తాగి బలవన్మరణానికి యత్నించిన తర్వాత కేసు నమోదు చేసి గంటలోపే స్టేషన్ బెయిలిచ్చి నిందితులను వదిలేశారు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ చంద్రకళ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులపై అప్పట్లో టీడీపీ నేతల ఒత్తిళ్లతో తూతూ మంత్రంగా కేసులు కట్టి తమ బిడ్డ చావుకు కారణమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిల్లలకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.సీఎం సహాయ నిధికీ మోకాలడ్డుచంద్రకళను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వద్దకు బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే.. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే నెపంతో ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చి నప్పుడు దరఖాస్తు చేసుకోండంటూ..’ హేళన చేశారు. సాయం అందకుండా మోకాలడ్డారు. అంతటితో ఆగకుండా తమపై పెట్టిన కేసు రాజీ చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డారు. తీవ్ర ఒత్తిడి చేశారు. మీరే దాడి చేశారంటూ అక్రమ కేసులు బనాయిస్తామని నిత్యం భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వేధింపులకు కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను చూడలేక మంచంలోనే చంద్రకళ నరకం అనుభవించింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ప్రాణం విడిచింది.మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు మా బిడ్డను అన్యాయంగా టీడీపీ వారే పొట్టున పెట్టుకున్నారు. టీడీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. నా కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలి. – బయన్న, మృతురాలి తండ్రి పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి. ఎమ్మెల్యేలకు, మంత్రులకు బందోబస్తు వెళ్లడానికి కేటాయిస్తున్న సమయం ప్రజలను రక్షించేందుకు వినియోగించాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలకు గొల్ల మమత, బోయ శ్రావణి, వడ్డే చంద్రకళలాంటి ఎంతో మంది అబలలు తనువు చాలించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి లేదు. పట్టపగలే ఓ వృద్ధురాలిని చంపితే ఇప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చంద్రకళ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటాం. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం -
పుట్టపర్తిలో భారీ అగ్నిప్రమాదం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తిలోని గోపురం రెండో వీధిలో ఉన్న సాయి పల్లవి అపార్ట్ మెంట్లో నివాసముంటున్న మాజీ మున్సిపల్ చైర్మెన్ రామాంజినేయులు ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు రామాంజినేయులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇంట్లోని అన్ని విలువైన వస్తువులూ కాలి బూడిదయ్యాయన్నారు. పనిమీద తాను విజయవాడకు వెళ్లడంతో భార్య మాధవీలత, కుమార్తెలు బిందు ప్రమద్వర, వేద మరుద్వతిలు ఇంట్లోనే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారన్నారు. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందికి తెలియజేయగా వారు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనపై పోలీస్లకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి చెప్పారు. రామాంజినేయులు మున్సిపల్ కమిషనర్గానూ, పుడా వైస్ చైర్మెన్గాను సుమారు 6 సంవత్సరాలు పని చేశారు. గత సంవత్సరం ఏసీబీ దాడుల్లో సస్పెన్షన్కు గురైనా పిల్లల చదువుల నిమిత్తం పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై రామాంజనేయులును సంప్రదించగా ఇది కుట్రపూరితంగా జరిగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
కంబదూరు / రొద్దం : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కువగా తిరిగిన వారు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన రామాంజనేయులు (50) ఆదివారం ఉదయం బంధువుల స్వగ్రామమైన కనగానపల్లికి వెళ్లాడు. అక్కడి నుంచి బండమీదపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో మధ్యాహ్నం సమయంలో కాలినడకన బయల్దేరాడు. మార్గమధ్యంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దారిలో వెళుతున్న కొందరు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రొద్దం మండలం బూచెర్లలో మహిళా కూలీ నాగమ్మ (55) సోమవారం వడదెబ్బతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
అతిగా మద్యం తాగి వృద్ధుడి మృతి
గోరంట్ల (పెనుకొండ) : మండల కేంద్రం గోరంట్లకు చెందిన ఎరుకుల రామాంజనేయులు (60) సోమవారం అతిగా మద్యం తాగి చనిపోయాడు. వైన్షాపు వద్దే ప్రాణాలు విడిచినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
దొంగ అరెస్ట్
యాడికి : మండలంలోని వేములపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన రామాంజనేయులు అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి అతడు వేములపాడులోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి బీరువాను పగులగొట్టేందుకు యత్నించాడు. ఇంటి యజమానులు గమనించి పట్టుకోబోగా అతడు పారిపోయాడు. వారి ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
వడదెబ్బతో రైతు మృతి
వడదెబ్బకు గురై రైతు మృతి చెందిన సంఘటన రూరల్ మండలం ఇటుకులపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకుంట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రామాంజినేయులు( 46) గురువారం పోలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై ఒక్క సారిగా కూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి చెందాడు. -
విద్యార్థి ఆత్మహత్య
పామిడి: పొలం పనులకు రావాలని పిలువగా.. రానని చెప్పిన కుమారుడిని ఓ తల్లి మందలించింది. దీంతో ఇంటర్ చదివే ఆ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో పొలం పనులకు రావాలని తల్లి చిట్టెమ్మ కోరింది. అందుకు రామాంజనేయులు ససేమిరా అనడంతో మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రామాంజనేయులు తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా, పురుగుల మందు తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగివచ్చిన ఆ దంపతులు నిర్జీవంగా పడి ఉన్న కుమారుడ్ని చూసి గుండెలు బాదుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రామాంజినేయులుగా గుర్తించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అనంతరం రామాంజినేయులు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు బోయ తిప్పేస్వామి, రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


