మరుగుదొడ్డే వెయిటింగ్‌ రూం! | toilet is using as a waiting room | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్డే వెయిటింగ్‌ రూం!

Sep 18 2016 8:38 PM | Updated on Aug 28 2018 5:25 PM

మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదిగా మార్చిన దృశ్యం - Sakshi

మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదిగా మార్చిన దృశ్యం

మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదులుగా ఏర్పాటు చేసిన విషయం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌ (డీఈఐసీ)లో జరిగింది.

  • రోగులకు తప్పని నిరీక్షణ
  • డీఈఐసీ అధికారుల బాగోతం
  • సంగారెడ్డి టౌన్‌: మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదులుగా ఏర్పాటు చేసిన విషయం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌ (డీఈఐసీ)లో జరిగింది. అయితే ఆస్పత్రికి వచ్చే రోగులకు  మరుగు దొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేయకపోవడంపై రోగులు మండిపడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న  12 గదుల్లో డీఈఐసీని ఏర్పాటు చేశారు.

    దాదాపు 30 లక్షలు ఖర్చు చేసి ఈ కేంద్రాన్ని రూపొందించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదిగా మార్చడంపై  సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమానికి (ఆర్‌బీఎస్‌కే) సంబంధించి వైద్యం అందించే కేంద్రంగా డీఈఐసీ ఏర్పాటు చేశారు.  

    ఇంత ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను మహిళలు, పురుషుల  నిరీక్షణ గదులుగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.   గదులకు, గోడలకు రంగులు, బొమ్మలు వేసి, ఫర్నీచర్‌ ఏర్పాటు చేశారు. రంగులు వేసి, ఫర్నిచర్‌ కోసం  పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.  

    డాక్టర్లు సేవలూ నామమాత్రమే
    డీఈఐసీలో వైద్య సేవలు నామ మాత్రంగానే అందుతున్నాయి. మెడికల్‌ ఆఫీసర్, ప్లే థెరపీ, డెంటల్‌ ల్యాబ్, ఎంఓ డెంటల్, లెబోరేటరీ, పిల్లల వైద్య నిపుణులు, మానసిక పరివర్తనా విభాగం, స్పెషల్‌ ఎడ్యుకేషన్, శ్రవణ చికిత్స విభాగం, ఎర్లీ ఇంటర్వెన్షన్, కంటి చికిత్సా విభాగం, ఫిజియో థెరఫి విభాగాలు ఉన్నాయి. కానీ డాక్టర్లు, సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండడం లేదు. సమయ పాలన పాటించడం లేదు. చూడడానికి అలంకరణ ప్రాయంగా దర్శనమిస్తోంది.

    మొక్కుబడిగా ఆర్‌బీఎస్‌కే
    ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలోని 0-18 సంవత్సరాల వయసు గల పిల్లలను అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. నలుగురు వైద్య సిబ్బంది గల 20 వైద్య బృందాలు ప్రతిపాదిత 30 వ్యాధులను పరీక్షిస్తారు. చికిత్సకు గుర్తించబడిన పిల్లల్ని ప్రత్యేక వాహనంలో డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌ వెన్షన్‌ సెంటర్‌ (డీఈఐసీ)కు తరలిస్తారు. డీఈఐసీలో ఉన్న వైద్య సిబ్బంది వారికి చికిత్స అందిస్తారు. రోగులకు అవసరమయ్యే శస్త్ర చికిత్సలు సంబంధిత ప్రత్యేకంగా గుర్తించిన ఆసుపత్రులలో నిర్వహించడం ఈ ఆర్‌బిఎస్‌కే పథకం లక్ష్యం.  

    లక్షల్లో వేతనాలు, నిర్వహణ ఖర్చు..
    నామ మాత్రంగా సాగుతున్న ఆర్‌బీఎస్‌కే పథకానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.  దాదాపు ఆరు నెలల సమయంలో ముప్పై లక్షలు ఖర్చు చేసి డీఐసీని రూపొందించారు.  గొడలకు రంగుల బొమ్మలు, ఫర్నిచర్, పరికరాలు, ల్యాబ్‌కు సంబం«ధించిన పరికరాలకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది.

    ఒక్కో వైద్య బృందంలో నలుగురు చొప్పున 80, డీఈఐసీతో కలిసి దాదాపు తొంభై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు దాదాపు 90 లక్షలకు పైగా జీతాలు చెల్లించారు. అంతే కాకుండా నిర్వహణ ఖర్చు మొత్తం దాదాపు రూ కోటి దాటింది.

    ఖర్చు బోలెడు..ఫలితం మూరెడు
    ఆర్‌బీఎస్‌కె పథకం ప్రారంభం కాకమునుపే ఉద్యోగుల నియామకం చేపట్టి దాదాపు మూడు నెలలు జీతాలు చెల్లించారు. డీఈఐసీలో నామమాత్రపు ఏర్పాట్లకు లక్షలు వెచ్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement