బంగారం అమ్మడానికి వెళ్లి.. | To sell gold .. | Sakshi
Sakshi News home page

బంగారం అమ్మడానికి వెళ్లి..

Aug 1 2016 11:27 PM | Updated on Sep 4 2017 7:22 AM

పట్టణంలో ఓ బంగారు షాపులో పని చేస్తున్న ఇద్దరు యువకులు బంగారం అమ్మడానికి ప్రొద్దుటూరు వెళ్లిన క్రమంలో వారిలో ఒకరు తిరిగి వచ్చారు.. మరొకరు అదృశ్యమయ్యారు. ఈ విషయంపై బంగారు వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

రాజంపేట:

పట్టణంలో ఓ బంగారు షాపులో పని చేస్తున్న ఇద్దరు యువకులు బంగారం అమ్మడానికి ప్రొద్దుటూరు వెళ్లిన క్రమంలో వారిలో ఒకరు తిరిగి వచ్చారు.. మరొకరు అదృశ్యమయ్యారు. ఈ విషయంపై బంగారు వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సంఘటన గత నెలలో చోటు చేసుకుంది. మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ బంగారు షాపులో వినోద్, గణేష్‌ అనే ఇద్దరు గుమస్తాలుగా పని చేస్తున్నారు. వీరు తరుచుగా ప్రొద్దుటూరుకు వెళ్లి అక్కడ బంగారు అమ్మకాలు సాగించి తద్వారా వచ్చిన డబ్బు తీసుకొని యజమానికి ఇస్తుంటారు. ఈ క్రమంలో నెల క్రితం వీరు 1 కేజి 300 గ్రాముల బంగారం అమ్మేందుకు ప్రొద్దుటూరు వెళ్లారు. 300 గ్రాముల బంగారు మాత్రం విక్రయించి, దానికి వచ్చిన నగదు, పాత బకాయి మరో రూ.5 లక్షల వసూలు చేసుకున్నారు. తిరిగి గణేష్‌ అనే యువకుడు రాజంపేటకు వచ్చాడు. వినోద్‌ కనిపించక పోవడంతో గణేష్‌ నుంచి షాపు యజమాని వివరాలు ఆరా తీశారు. 300 గ్రాముల బంగారు అమ్మి, మరో రూ.5 లక్షలు తీసుకున్న వినోద్‌ వెనకనే వస్తానని చెప్పినట్లు గణేష్‌ తన యజమానికి తెలిపినట్లు తెలిసింది. షాపు యజమాని సంబంధీకులు ఉస్మాన్‌నగర్‌లో నివసిస్తున్న వినోద్‌ తండ్రిని బెదిరించి దాడి చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం పట్టణ పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇంతకూ వినోద్‌ ఉన్నాడా? లేక లేడా, అతని దగ్గర ఉన్న రూ.45 లక్షల విలువ గల బంగారు, రూ.5 లక్షలు నగదు ఏమైనట్లు తెలియని పరిస్థితి. పోలీసులు రంగ ప్రవేశం చేస్తేనే నిజనిజాలు బహిర్గతమవుతాయి.
 

Advertisement

పోల్

Advertisement