చేప ప్రసాదానికి స్పెషల్ బస్సులు

చేప ప్రసాదానికి స్పెషల్ బస్సులు - Sakshi


సాక్షి, హైదరాబాద్: చేపప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసీ  ప్రత్యేక బస్సులను  నడిపేందుకు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, మహాత్మాగాంధీ,జూబ్లీ బస్‌స్టేషన్‌లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  వచ్చే  వారు నేరుగా  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకొనేలా ఈ నెల 8,9 తేదీల్లో అదనపు బస్సులను  నడపనున్నారు. 8వ తేదీ ఉదయం  4 గంటల నుంచి  9వ తేదీ చేపప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు 100  ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు  ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ తెలిపారు.


ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంతో పాటు, దిల్‌శుఖ్‌నగర్, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ,మిధానీ ల్యాబ్ క్వార్టర్స్, ఉప్పల్, చార్మినార్,గోల్కొండ,రాంనగర్,రాజేంద్ర నగర్, రీసాలాబజార్,ఈసీఐఎల్,పటాన్‌చెరు,జీడిమెట్ల,కేపీహెచ్‌బీ,తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులకు  ‘చేపప్రసాద్ స్పెషల్-నాంపల్లి-ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతారు.


 సహాయ కేంద్రాలు... కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్,జేబీఎస్‌ల వద్ద  ప్రయాణికుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో   ప్రయాణికులు ఫోన్  ద్వారా  కూడా ఆర్టీసీ అధికారుల నుంచి స్పెషల్ బస్సుల సమాచారాన్ని పొందవచ్చు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top