వారాంతపు రద్దీతో శనివారం తిరుమల కిటకిటలాడింది.
తిరుమల: వారాంతపు రద్దీతో శనివారం తిరుమల కిటకిటలాడింది. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల్లో భక్తులు అధిక సంఖ్యలో నడిచివచ్చి మొక్కులు చెల్లించారు. నారాయణగిరిలోని కాలిబాట క్యూలైన్లు నిండుగా కనిపించాయి. భక్తులు తమ లగేజీ డిపాజిట్చేసేందుకు క్యూలైన్లలో అధిక సమయం వేచి ఉండాల్సి వచ్చింది. సర్వదర్శనం క్యూలైన్లూ నిండుగా కనిపించాయి. సాయంత్రం 6గంటల వరకు మొత్తం 75,876 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇదే సమయానికి 31 కంపార్ట్మెంట్లలో నిండిన సర్వదర్శనం భక్తులకు 14 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేకపోవడంతో రిసెప్షన్ కార్యాలయాల వద్ద భక్తులు గదుల కోసం నిరీక్షించారు. తలనీలాలు సమర్పించే ప్రధాన కల్యాణకట్టలు, మినీ కల్యాణకట్టల్లోనూ రద్దీ పెరిగింది. రద్దీ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు క్యూలైన్లు, ఆలయంలో తనిఖీ నిర్వహించారు.