ప్రైవేటు ‘పది’కి స్వస్తి..! | private tenth is a past | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ‘పది’కి స్వస్తి..!

Oct 7 2016 11:10 PM | Updated on Sep 4 2017 4:32 PM

ప్రైవేటు ‘పది’కి స్వస్తి..!

ప్రైవేటు ‘పది’కి స్వస్తి..!

పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం ఇక కుదరదు. గతంలో పరీక్ష ఫీజు చెల్లించి నేరుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసేవారు. ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్‌ కంటిన్యూవస్‌ ఎవాల్యూషన్‌ (సీసీఈ) ఫలితంగా పదో తరగతిలో ప్రైవేటు స్టడీ ఫుల్‌స్టాప్‌ పడింది.

సీసీఈలో ఇంటర్నల్‌ మార్కుల కేటాయింపు ఫలితం
ఇకపై ఓపెన్‌ స్కూల్‌ విధానమొక్కటే మార్గం
ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ


శ్రీకాకుళం : పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం ఇక కుదరదు. గతంలో పరీక్ష ఫీజు చెల్లించి నేరుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసేవారు. ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్‌ కంటిన్యూవస్‌ ఎవాల్యూషన్‌ (సీసీఈ) ఫలితంగా పదో తరగతిలో ప్రైవేటు స్టడీ ఫుల్‌స్టాప్‌ పడింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలను జారీ చేసిందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్‌ స్కూల్‌ విధానం ఒక్కటే మార్గం.
 

 సీసీఈ ఎఫెక్ట్‌..
ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మేటీవ్, సమ్మేటీవ్‌ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనాంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. అయితే ప్రైవేట్‌ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్‌ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రైవేట్‌ స్టడీ విధానాన్ని రద్దు చేసింది.
 

ఓపెన్‌ స్కూలే దిక్కు..
జిల్లాలో ఏటా 3500 నుంచి 4500 మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్టడీ విధానంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement