భీమవరం అర్బన్: స్వదేశంలో తమ పరిస్థితి శరణార్థులుగా మారిందని గోదావరి మెగా ఫుడ్పార్కు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
స్వదేశంలో శరణార్థులుగా మారాం
Sep 19 2016 1:22 AM | Updated on Oct 4 2018 5:10 PM
భీమవరం అర్బన్: స్వదేశంలో తమ పరిస్థితి శరణార్థులుగా మారిందని గోదావరి మెగా ఫుడ్పార్కు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేం తీవ్రవాదులమా, దేశ ద్రోహులమా.. ఇంటి నుంచి కాలు బయట పెడితే పోలీసులకు సవాలక్ష అనుమానాలను నివృత్తి చేయాల్సి వస్తోంది. ప్రశాంతమైన గ్రామాలు పోలీస్ రాజ్యంలా మారాయి’ అంటూ తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరి నాగ సురేష్కుమార్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్lనుంచి వచ్చిన పొత్తూరి నాగ సురేష్కుమార్ ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని నాగసురేష్కుమార్ అన్నారు. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే బ్రిటీష్ పాల నను తలపిస్తోందన్నారు. ఎక్కడ చూసిన పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పౌరహక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తక్షణమే గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
చర్చినీ వదలని పోలీసులు
విశ్వాçÜులు చర్చిలకు వెళితే అక్కడ చర్చలు జరుపుతారనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకున్నారు. చర్చి ఆరుబయట ప్రార్థనలు చేసుకోవాలని ఆదేశించారు. దైవ కార్యక్రమాలకు సైతం పోలీసులు అడ్డుపడటం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకచవితి వేడుకలకు కూడా తాము దూరమయ్యాయని పలువురు గ్రామస్తులు వాపోయారు.
అన్యాయంగా అరెస్ట్ చేశారు
తన భర్తను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని జొన్నలగరువు గ్రామానికి చెందిన కీర్తన అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనిచేసుకుని తనతో పాటు ముగ్గురు పిల్లల్ని పోషిస్తున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు గడవడం కష్టంగా ఉందని, తన భర్తను విడుదల చేయాలని కోరారు.
Advertisement
Advertisement