నిట్ విద్యార్థినుల ఆందోళన
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని తాత్కాలిక నిట్ బాలికల హాస్టల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు.
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని తాత్కాలిక నిట్ బాలికల హాస్టల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. శనివారం తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. సరైన ఆహారం, మెడికల్, అంబులెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. అకడమిక్ ఇన్చార్జి ప్రొఫెసర్ పి.బంగారుబాబు, ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫెరెన్స్లో నిట్ శాశ్వత డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లామని విద్యార్థినులు అన్నారు. అయినా సమస్యలు పరిష్కరం కాలేదని వాపోయారు. హాస్టల్లో పురుగుల సమస్య ఎక్కువగా ఉందని, ఇవి కుట్టడంతో పలువురు విద్యార్థినులు చర్మసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన సరంజామా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇక్కడ విషయాలపై నిట్ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని అకడమిక్ ఇన్చార్జి ప్రొఫెసర్ పి.బంగారుబాబు భరోసానివ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.