తిరుమలలో కిడ్నాపైన నవ్యశ్రీ (5)ని తల్లిదండ్రుల వద్దకు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సురక్షితంగా చేర్చారు.
–పాప ఆచూకీ తెలిపిన యాదయ్యకు డీజీపీతో సత్కరిస్తాం
– తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి
తిరుపతి క్రైం : తిరుమలలో కిడ్నాపైన నవ్యశ్రీ (5)ని తల్లిదండ్రుల వద్దకు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సురక్షితంగా చేర్చారు. మంగళవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ మాట్లాడారు. జనవరి 29న అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం తూమచర్ల గ్రామానికి చెందిన మహాత్మ, వరలక్ష్మీ దంపతులు వారి ఇద్దరి పిల్లలతో తిరుమలకు వచ్చారు. పీఏసీ–2లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నవ్యశ్రీని అపహరించాడు. అనంతరం మహబూబ్నగర్ వెళ్తున్న బస్సులో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన యాదయ్య.. అపరిచుతుడితో ఉన్న పాపతో మాట్లాడి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకుని మిడ్జిల పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు.
దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా పాపను తిరుమల నుంచి కిడ్నాప్ చేశానని, తనది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లె మండలం అంతరం గ్రామానికి చెందిన బాలస్వామి అని నిందితుడు పేర్కొన్నాడు. దీంతో అక్కడ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాపను సురక్షితంగా తీసుకొచ్చారు. యాదయ్యను విజయవాడకు పిలిపించి ఏపీ డీజీపీ సాంబశివరావుతో ఘనంగా సత్కరించి పోలీసు రివార్డు ఇస్తామని అర్బన్ ఎస్పీ ప్రకటించారు. సమావేశంలో తిరుమల సీఐ వెంకటరవి, ఎస్ఐ తులసీరాం పాల్గొన్నారు.