ప్రచార వే'ఢీ' | association elections in RTC | Sakshi
Sakshi News home page

ప్రచార వే'ఢీ'

Jul 16 2016 5:56 PM | Updated on Sep 17 2018 6:08 PM

గుర్తింపు సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్టీసీలో ప్రచార వేడి ఊపందుకుంది.

 రీజియన్‌లో మారిన సమీకరణలు 19 న పోలింగ్
 
సత్తుపల్లి టౌన్ : గుర్తింపు సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్టీసీలో ప్రచార వేడి ఊపందుకుంది. ఈ నెల 19న పోలింగ్ జరగనుండడంతో కార్మికులు, నాయకులు బిజీబిజీగా మారారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ దఫా పొత్తుల సమీకరణలు మారాయి. ప్రధానంగా రీజియన్ పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి, టీఎంయూల మధ్యే పోటీ నెలకొంది. అరుుతే గత ఎన్నికల్లో ఈ రెండు కలిసి  పోటీ చేశాయి. రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్ అధికారంలోకి రాగా,  రీజియన్‌లో స్పష్టమైన ఓట్లు రాకపోవటంతో ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగింది. 
 
 రీజియన్‌లో సగం ఓట్లు వస్తేనే గుర్తింపు..
ఖమ్మం రీజియన్‌లో  మూడువేల మంది కార్మికులు ఉండగా 2844 మందికి ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఐఎన్‌టీయూసీ సంఘాలు మాత్రమే ఉండగా,  ఈ ఎన్నికల్లో కొత్తగా బీకేయూ(బహుజన కార్మిక సంఘం) ఆవిర్భవించింది.  రీజియన్‌లోని 2844 ఓట్లకు గాను 1423 ఓట్లు ఏ యూనియన్‌కు వస్తే ఆ యూనియన్‌కు రీజినల్ గుర్తింపు వస్తుంది. ఏ సంఘానికి మొత్తం ఓట్లలో సగం ఓట్లు రాకపోతే  రాష్ట్రంలో ఏ యూనియన్ గుర్తింపులో ఉంటే ఆ యూనియన్‌నే జిల్లా స్థానిక గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. 
 
 ఒక్కో  కార్మికుడికి రెండు ఓట్లు..
ఆర్టీసీలో ప్రతి కార్మికుడికి రెండు ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటరు  క్లాస్-6 రీజియన్‌లో, క్లాస్-3 రాష్ట్రస్థాయిలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ అధికారులు నిర్వహిస్తారు. రీజియన్‌లోని ఖమ్మం,మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోలలో ఈ నెల 19న ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు. 
 
 మారిన పొత్తులు.. సమీకరణలు.. 
గత ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో టీఎంయూ మద్దతుతో ఈయూ రాష్ట్ర గుర్తింపు సాధించింది. జిల్లాలో స్థానిక గుర్తింపుకు కావాల్సిన ఓట్లు ఏ యూనియన్‌కు రాకపోవటంతో రాష్ట్రగుర్తింపు సంఘంగా ఉన్న ఈయూ ఖమ్మం రీజియన్‌లో స్థానిక గుర్తింపు సంఘంగా ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఐఎన్‌టీయూసీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. టీఎంయూ, ఎన్‌ఎంయూ, బీకేయూ విడివిడిగా బరిలో నిలిచారుు. అయితే ఐఎన్‌టీయూసీ కేవలం రాష్ట్రంలో గుర్తింపు క్లాస్-3కి ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి ఓటు వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒప్పందం కుదిరింది. కానీ ఖమ్మం రీజియన్‌లో మాత్రం ఐఎన్‌టీయూసీ ఓటు ఆ సంఘానికే(క్లాస్-6) వేసుకుంటామని ప్రకటించారు. 
 
 ముమ్మరంగా ప్రయత్నాలు 
గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఆర్టీసీలో ప్రచారం ఊపందుకుంది. ప్లెక్సీలు, కరపత్రాలు, హోర్డింగ్‌లు, బ్యాడ్జీలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారు. డిపోలలో జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని స్థానిక గుర్తింపు కోసం ఆ యూనియన్ సభ్యులు వేరే యూనియన్‌కు ఓట్లు  క్రాస్   కాకుండా చైతన్యం చేస్తున్నారు.  రాష్ట్ర గుర్తింపు కోసం టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్‌ఎంయూ  ప్రధాన పోటీలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement