పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి కలకలం

Suicide Attack In Pakistan Killed ANP Leader And Other People - Sakshi

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి సహా 14మంది మృతి

పెషావర్‌ : పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఓ నేత సహా 14 మంది మృతిచెందగా, దాదాపు 60 మంది  మరో తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ ఈ చర్యకు పాల్పడింది తామేనని ప్రకటనలు విడుదల చేయలేదు.

అవామీ నేషనల్‌ పార్టీ (ఏఎన్‌పీ) పెషావర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఏఎన్‌పీ నేత హరూన్‌ బిలౌర్‌ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. హరూన్‌ బిలౌర్‌ను హత్య చేయాలని కొందరు కుట్రపన్నారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా బాంబు పేలిన ఘటనలో 14 మంది మృత్యువాత పడగా 60 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల్లో ఏఎన్‌పీ అభ్యర్థి హరూన్‌ బిలౌర్‌ ఉన్నారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో హరూన్‌ ఉండటం గమనార్హం. 2013 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏఎన్‌పీ అభ్యర్థులు, నేతలపై తాలిబన్లు ఉగ్రదాడులకు పాల్పడిన విషయం విదితమే.

దీనిపై పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌​ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు దారుణాన్ని ఖండించారు. ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు వారి నేతలకు సరైన భద్రత కల్పించాలని ఇమ్రాన్‌ సూచించారు. ఈ మేరకు ట్వీట్‌ ద్వారా ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top