నానీ.. అమ్మ వచ్చింది లేరా? | Road Accident In Prakasam | Sakshi
Sakshi News home page

నానీ.. అమ్మ వచ్చింది లేరా?

Aug 28 2018 10:11 AM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accident In Prakasam - Sakshi

తమ్ముడిని తట్టి లేపుతున్న అక్క  రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న అనిల్‌

కొండపి (ప్రకాశం): సమయం రాత్రి 7.30 గంటలు.. కొండపి నుంచి రయ్‌..మంటూ బైక్‌పై ఇద్దరు యువకులు కట్టావారిపాలెం వైపు దూసుకెళ్తున్నారు. కట్టావారిపాలెం డిగ్రీ కళాశాలకు కూతవేటు దూరంలో ఎదురుగా వచ్చిన చెక్కులు ట్రాక్టర్‌ డోర్‌లు తగిలి ఇద్దరూ కింద పడిపోయారు. రక్తమోడుతున్న ఇద్దరు యువకులను కొండపి ఎస్‌ఐ తన మొబైల్‌ వాహనంలో మెరుపు వేగంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. స్ట్రక్చర్‌పై పడుకోబెట్టగా ఓ యువకుడు అప్పటికే విగత జీవిగా మారాడు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు తరలించారు. ఈ సంఘటన కొండపి సమీపంలో సోమవారం రాత్రి జరిగింది.

ఎస్‌ఐ చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. కొండపి పంచాయతీ కట్టావారిపాలెం గ్రామానికి చెందిన తన్నీరు అనిల్‌ (19), తన్నీరు మహేష్‌ (17)లు అక్క చెల్లెళ్ల పిల్లలు. వరుసకు అన్నదమ్ములు. బైకుపై కొండపి వచ్చి రాత్రి 7.30 సమయంలో తిరిగి కట్టావారిపాలెం బయల్దేరారు. గ్రామానికి సమీపంలో ఇలవర నుంచి చెక్కులు లోడుతొ డోర్‌లు తీసుకుని వస్తున్న ట్రాక్టర్‌ తగిలింది. అనిల్‌ తల, శరీరానికి గాయాలయ్యాయి. మహేష్‌ కుడి చేయితో పాటు తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తన వాహనంలో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో తన్నీరు అనిల్‌ మృతి చెందగా మహేష్‌కు మెరుగైన వైద్యం కోసం 108లో ఒంగోలు తరలించారు.
 
దిక్కులు పిక్కటిల్లేలా బంధువుల రోదన
యువకుల ప్రమాదవార్త తెలుసుకున్న మృతుడు తల్లి, అక్క, ఇతర బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. అనిల్‌ అక్క తమ్ముడి శవాన్ని పట్టుకుని నాని.. ఇటు చూడరా ఒక్కసారి.. అమ్మ వచ్చింది.. లేవరా..అంటూ రోదించడం చూపరులకు కన్నీరు తెప్పించింది. మాలకొండయ్య, శేషమ్మ దంపతులకు అనిలఒక్కడే  కుమారుడు. మృతుడి కంటే ముందు ముగ్గురు అక్కలు ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన మహేష్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారు. వడ్డెర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
కొలుపులని వచ్చి..కానరాని లోకాలకు 
కట్టావారిపాలెం గ్రామానికి చెందిన అనిల్‌ హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు. మహేష్‌ అక్కడే బేల్దారి పనులు చేస్తున్నాడు. గ్రామంలో అంకమ్మ కొలుపులు ఉండటంతో వచ్చారు. వడ్డెర కాలనీలో కొలుపులతో నెలకొన్న సందడి యువకులకు జరిగిన ప్రమాదంతో ఆవిరైంది. వైద్యశాలలో డ్యూటీ డాక్టర్‌లు అందుబాటులో లేకపోవడంతో క్షతగాతుడిని ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement