కల్పన మృతదేహం వెలికితీత!

Police Form Special Investigation Team in Hajipur Serial Murders - Sakshi

సాక్షి, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో వెతికిన పోలీసులు.. ఎట్టకేలకు కల్పన ఆస్తికలను గుర్తించారు.  ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఒకే బావిలో లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన మరో బావిలో కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదేవిధంగా శ్రావణి, మనీషాలను కూడా అత్యాచారం చేసి.. శ్రీనివాస్‌రెడ్డి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.

సిట్‌ ఏర్పాటు
హజీపూర్‌ వరుస హత్యల కేసులో దర్యాప్తు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశారు. భువనగిరి ఇన్‌స్పెక్టర్‌తోపాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను ఈ సిట్‌లో నియమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top