ఆ కేసులు ఖాకీలకు సవాలే! | Old Couple Murder Case Still Mystery In Guntur | Sakshi
Sakshi News home page

ఆ కేసులు ఖాకీలకు సవాలే!

Dec 6 2018 1:17 PM | Updated on Dec 6 2018 1:17 PM

Old Couple Murder Case Still Mystery In Guntur - Sakshi

వృద్ధ దంపతులపై దాడి, దోపిడీ జరిగిన నందివెలుగులోని ఇల్లు(ఫైల్‌)

గుంటూరు, తెనాలిరూరల్‌:పోలీసులకు ఆ కేసులు సవాలుగా మారాయి. నేరాలు చేసిన నిందితులు ఖాకీలకు సవాలు విసిరారు. చిన్న ఆధారమైనా లేకపోవడంతో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతుల హత్య, దోపిడీ కేసులో రెండున్నరేళ్లయినా నిందితులకు సంబంధించి చిన్న ఆధారమైనా లేదు. బంగారు వ్యాపారులను మోసగించి పశ్చిమ బెంగాల్‌ పరారైన వ్యక్తిని పట్టుకోవడంలో కూడా తాత్సారమే. బంగారు నగను తాకట్టు పెట్టుకుని నగదు తీసుకుని, త్వరలోనే విడిపించి ఇస్తానంటూ విశ్రాంత ఎంపీడీవోను మోసగించిన కేసులోనూ న్యాయం జరుగలేదంటూ బాధితుడు అర్జీల మీద అర్జీలు పెడుతున్నారు. సబ్‌ డివిజన్‌లో జరిగిన నేరాలకు సంబంధించిన ఈ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేని కేసు ఒకటి, అసలు నిందితులకు సంబంధించిన ఆధారమేదీ దొరకనిది మరొకటి, 420 కేసులోనూ న్యాయం జరగక పోలీసు ఉన్నతాధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్న కేసు మరొకటి. వివరాలిలా ఉన్నాయి.

తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మలపై 2016 మే నెల 29వ తేదీన గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు గుర్తించిన కుటుంబసభ్యులు బాధితులిద్దరిని గుంటూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా, అదే ఏడాది జూన్‌ 15వ తేదీన భార్య మృతి చెందగా, 25వ తేదీన భర్త మరణించాడు. నాగరత్నమ్మ మెడలో ఉన్న బంగారు తాడు, చేతి గాజులు, చెవి పోగులు, ఇతర ఆభరణాలు, కొంత నగదు అపహరణకు గురయ్యాయని మృతుల కుటుంబసభ్యులు అప్పట్లో పోలీసులకు తెలిపారు. ఘటన జరిగి రెండున్నరేళ్లయినా ఈ కేసులో ఇప్పటికీ పురోగతి లేదు. ఎవరు చేశారన్న దానిపై పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. దంపతుల్లో ఒక్కరైనా కోలుకుని ఘటనకు సంబంధించిన సమాచారం అందిస్తారని భావించినా అదీ జరగలేదు. పోలీసులు రెండు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేశారు. తాలూకా పోలీసు అధికారులు స్టేషనుకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ కేసును ఛేదించిన అనంతరం స్టేషన్‌కు రావాలని అప్పట్లో రూరల్‌ ఎస్పీ నారాయణ్‌నాయక్‌ ఇక్కడి సిబ్బందిని ఆదేశించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టినా, ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు.

జాడేది ‘భాయ్‌’...
పట్టణానికి చెందిన ఓ బంగారు ఆభరణాల తయారీ కేంద్రం నిర్వాహకుడు సుమారు నాలుగు కిలోల బంగారంతో ఉడాయించాడు. బంగారు ఆభరణాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన తెనాలిలో ‘భాయ్‌’ అని పిలుచుకునే వ్యక్తి సుమారు 15 ఏళ్లుగా ఆభరణాల తయారీ కేంద్రాన్ని నిర్వహించాడు. తెనాలితో పాటు ముంబయి నగరంలోనూ ఇతని కార్యకలాపాలు ఉండేవి. వ్యాపారుల నుంచి ఆర్డర్‌ తీసుకుని అందుకు తగ్గట్టు ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. సాధారణంగా వ్యాపారుల నుంచి ముందుగానే ముడి బంగారాన్ని తీసుకుని ఆభరణాలను తయారు చేస్తారు. అయితే 15 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటున్న ‘భాయ్‌’కి ముడి బంగారం ఇవ్వకుండానే ఆర్డర్‌ ఇస్తే ఆభరణాలను తయారు చేసిచ్చి అనంతరం బంగారాన్ని తీసుకునేవాడు. ఆభరణాల తయారీతో పాటు ‘బంగారు’ చీటీ పాటలు నిర్వహిస్తుండేవాడు. నెలకు 40, 50, 100 గ్రాములుగా చీటీలు నిర్వహిస్తుండే వాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ సమ్‌నాథ్‌ మహతి అలియాస్‌ బడా భాయ్‌ 2015 నవంబరులో తెనాలి నుంచి హఠాత్తుగా జెండా పీకేశాడు. ఇతని కోసం పోలీసులు బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ వెళ్లి విచారించారు. బడా భాయ్‌ స్వగ్రామం, అతని కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో విచారణకు వెళ్లగా, అక్కడి స్థానికులు బడాభాయ్‌కు మద్దతుగా తెనాలి పోలీసులను ముప్పతిప్పలు పెట్టడంతో చేసేది లేక వెనుదిరిగారు. బడా భాయ్‌కు సంబంధించి వన్‌టౌన్, టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

420 కేసులోనూ...
పట్టణానికి చెందిన విశ్రాంత ఎంపీడీవో షేక్‌ మొహిద్దీన్‌కు తన ఇంటి వద్ద అద్దెకు నివసించే చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన గడ్డిపాటి నాగప్రసాద్‌ పరిచయమయ్యాడు. పట్టణంలోని బోస్‌రోడ్డులో షేర్‌ బ్రోకర్‌గా పనిచేసే అతడు అత్యవసరంగా డబ్బు అవసరమైందని, సర్దుబాటు చేస్తే త్వరలోనే తిరిగిచ్చేస్తానని చెప్పి, మొహిద్దీన్‌ కుటుంబానికి చెందిన 78 గ్రాముల బంగారు హారాన్ని తీసుకువెళ్లాడు. కుదువపెట్టి పెద్దమొత్తంలో నగదు తీసుకుని, పట్టణం నుంచి బిచాణా ఎత్తేశాడు. దీనిపై బాధితుడు 2017 సెప్టెంబర్‌లో పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసంపై 420 కేసు పెట్టాడు. 14 నెలలైనా ఈ కేసులో కూడా నిందితుని ఆచూకీ లేదు. కేసును పోలీసులు నీరుగార్చారంటూ బాధితుడు వాపోతున్నారు.

వృద్ధ దంపతుల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
నందివెలుగు వృద్ధదంపతుల దోపిడీ, హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఇప్పటికీ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నాం. నిందితులను వదిలే ప్రసక్తి లేదు. బంగారంతో ఉడాయించిన కేసుల్లో బాధితులు ముందుకు వస్తే న్యాయం జరిగేలా చూస్తాం.–మందపల్లి స్నేహిత, డీఎస్పీ, తెనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement