భార్య మృతి తట్టుకోలేక..

Husband Suicide as Wife Dies In Mahabubnagar - Sakshi

సాక్షి, నవాబుపేట (జడ్చర్ల): పెళ్లి పందిట్లో తోడూనీడగా ఉంటామని బాస చేసిన ఆ వధూవరులు.. తాము ఉంటే ఇద్దరం జీవించాలి.. లేకుంటే చనిపోవాలంటూ నిర్ణయించుకున్నట్టుంది..! భార్య మరణ వార్త విన్న వెంటనే భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం లోని కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్‌ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికంగా తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితం సొంత పనిమీద బైక్‌పై ఇద్దరూ నవాబుపేటకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమ్మపూర్‌గేట్‌ సమీపంలో ప్రమాదవశాత్తు భార్య కింద పడింది.

తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితం తనకు వద్దంటూ మనస్తాపం చెందిన భర్త సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. కాగా, వివాహం జరిగి పట్టుమని రెండేళ్లయినా నిండని దంపతులు ఇలా తుదిశ్వాస విడవటంతో గ్రామస్తులు బోరున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top