చిత్ర దర్శకుడికి దేహశుద్ధి
టీ.నగర్: సినిమా అవకాశాలు ఇప్పిస్తానని యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిని చిత్ర దర్శకుడికి ప్రజలు సోమవారం దేహశుద్ధి జరిపారు. ఈరోడ్ సమీపానగల మామరత్తుపాళయం ప్రాంతానికి చెందిన కవిత (21), కైకాట్టివలసు ప్రాంతానికి చెందిన ఓవియ (20). ఇరువురూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. చెన్నైకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి తాను చిత్ర దర్శకుడనని, వారికి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ జ్ఞానవేల్, బ్రోకర్ ముత్తుకుమార్తో కరుప్పు పూనై (నల్లని పిల్లి) పేరుతో సినిమా తీస్తున్నట్లు నమ్మబలికాడు.
అంతేకాకుండా వారి వద్ద నగదు వసూలు చేసినట్లు తెలిసింది. తర్వాత వీరిని చెన్నైలోని ఒక లాడ్జిలో ట్రెయినింగ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకువచ్చారు. అక్కడ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అక్కడి నుంచి వారు తప్పించుకున్నారు. ఈ స్థితిలో సెల్వకుమార్ పెరుందురై సమీపానగల కాంచి కొండయమ్మన్ కాట్టువలసు ప్రాంతానికి వస్తున్నట్లు తెలుసుకున్న కవితా, ఓవియా తమ బంధువులతో అక్కడికి చేరుకుని సెల్వకుమార్, అతని స్నేహితులు ముగ్గురిపై చెప్పులతో దాడి జరిపారు. అనంతరం కాంచికోవిల్ పోలీసు స్టేషన్లో అప్పగించారు.