లాభాల్లోకి మార్కెట్లు, తప్పని ఊగిసలాట

Sensex Nifty Recover From Early Losses Amid Volatile Trade - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో నష్టాలతో కనిపించినా వెంటనే 200 పాయింట్లకు పైగా ఎగిసాయి. గ్లోబల్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా.. కీలక సూచీలు స్వల్ప లాభాల్లో మందకొడిగా ట్రేడవుతున్నాయి. కరోనా వ్యాప్తి విస్తృతంకానుందన్న అంచనాలతో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుండడంతో అనేక రంగాలకు చెందిన స్టాక్స్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 26854 వద్ద, 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 
7853 వద్ద ట్రేడవుతోంది. 228 పాయింట్లు నష్టంతో బ్యాంక్ నిఫ్టీ 16879 వద్ద ట్రేడవుతోంది. తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.

మరికొంత కాలంపాటు స్టాక్‌ మార్కెట్లకు లాభనష్టాల మధ్య ఊగిసలాట తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక అంశాలను ప్రకటించిన అనంతరం స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా  లాభాలతో ముగిసాయి. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లోని షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండగా.. హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి. రిలయన్స్‌ జియోలో వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ చర్చలు జరుపుతోందన్న వార్తలో రిలయన్స్ భారీగా లాభపడుతోంది. ఇంకా నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్  బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ కారణంగా మనీ మార్కెట్లకు సెలవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top