తల్లి గోదారి పరవళ్లు చూద్దామని వారు బయల్దేరారు. ఆ పుణ్యనదీఝరిలో స్నానం చేసి తరిద్దామని ఎంతో ఆశపడ్డారు.
తల్లి గోదారి పరవళ్లు చూద్దామని వారు బయల్దేరారు. ఆ పుణ్యనదీఝరిలో స్నానం చేసి తరిద్దామని ఎంతో ఆశపడ్డారు. నూట నలభై నాలుగేళ్లకు ఓ సారి వచ్చే మహా పుష్కరాల్లో ఆ జీవనది వైభవాన్ని కళ్లారా చూడాలని ఎంతగానో తపించారు. కానీ వారికేం తెలుసు... ఆ తల్లి చెంతనే మృత్యువు తమ కోసం మాటువేసి ఉందని, ఆ పుష్కర యాత్రే తమకు అంతిమ యాత్ర అవుతుందని. రాజమండ్రి పుష్కర ఘాట్లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందారు. ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. మరికొందరు గాయపడ్డారు.
గోదారి ఒడ్డునే ఊపిరి వదిలిన ఈ భక్తులను చూసి జిల్లా కన్నీళ్లు పెట్టింది. ఉదయం నుంచి పుష్కర సంబరాలు చూద్దామని టీవీలకు అతుక్కుపోయిన భక్తులను ఒక్కసారిగా విషాదం ఆవహించింది. వెంటవెంటనే మృతుల సంఖ్య పెరుగుతుండడంతో తమ వారి పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలో ప్రారంభమైంది. ఫోన్లు చేసిన తమ వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. మరికొందరు టీవీల ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకొందరు ఆ వార్తలను చూడలేక టీవీలను ఆపివేశారు. అయినా అందరిలో ఒకటే ఆతృత. పుణ్యం కోసం వెళ్లిన వారికి ఎందుకీ ఆపదవచ్చిందని ఆవేదన చెందారు. మృతి చెందిన ముగ్గురూ మహిళలే, అందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే...
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో పుణ్య స్నానమాచరిద్దామని వెళ్లిన జిల్లాకు చెందిన పుష్కర యాత్రికులకు చావు ఎదురైంది. గోదావరిలో మునిగి పుణ్యం మూట కట్టుకుని వచ్చే తమవారిని చూసి తరిద్దామనుకున్న కుటుంబ సభ్యులు బంధువుల మృత దేహాల మూటలు చూడాల్సి వస్తుందనుకోలేదని బోరున విలపిస్తున్నారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. బాడంగి మండలం పాల్తేరుకు చెందిన అమలాపురం పైడితల్లి, కొత్త వలస మండలం తుమ్మికాపల్లి గేట్ వద్ద నివసిస్తున్న ఆరిపాక నారాయణమ్మ తొక్కిసలాటలో మృతి చెందగా, విజయనగరానికి చెందిన కుచ్చర్ల పాటి సత్యవతిలు తొక్కిసలాట నేపథ్యంలో ఊపిరాడక మృతి చెందారు.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ పాల్తేరు గ్రామానికి చెందిన పూడి పారమ్మ, పొట్నూరి గంగమ్మ కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. అదే గ్రామానికి చెందిన పోలి పోలమ్మ, అమలాపురం నాగమ్మ గాయపడగా, అంబటి అప్పారావు, సుభద్ర దంపతులతో పాటు ఆయన కుమారుడు పైడిరాజులు గల్లంతయ్యారు. అలాగే జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్లోని బొగ్గుల దిబ్బకు చెందిన అలబోయిన కాంతమ్మ సోమవారం అర్ధరాత్రి రెలైక్కుతూ జారిపడి తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందింది.
ఇలా పుష్కరాలకు వెళ్లిన వారికి ఇలా చావులు రావడమేంటని ఆయా కుటుంబాలకు చెందినవారు రోదిస్తున్నారు. జిల్లానుంచి వేలాది మంది పుష్కర యాత్రకు వెళ్తున్నప్పటికీ మొదటి రోజు పుష్కర స్నానం చేసి వద్దామని బయలు దేరిన వారు ఇలా ప్రమాదంలో మృతి చెందడం, గాయాల పాలు కావడం అందర్నీ కలవర పరచింది. గత ఏడాది ఇదే సీజన్లో చెన్నైలో 24 మంది జిల్లాకు చెందిన వలస కూలీలు భవనం కూలిన ఘటన నుంచి తేరుకోక ముందే ఇలా ఇతర జిల్లాలో జిల్లాకు చెందిన వారు మృతి చెందారని తెలిసిన జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. ఏ మండలానికి చెందిన వారు మృతి చెందారు? ఏఏ గ్రామాల వారు? ఎంత మంది ఉంటారన్న ప్రశ్నలు, ఆచూకీ తీస్తూ క్షణ క్షణం ఉత్కంఠకు గురయ్యారు జిల్లా వాసులు. పుష్కర యాత్రకు వెళ్లిన వారిలో పాల్తేరుకు చెందిన వారే 80 మంది ఉన్నారు. వీరిలో తలా ఒక వైపు పుష్కర ఘాట్లలో స్నానమాచరిస్తున్నారు.
జిల్లా నుంచి 50 వేల మంది
వాస్తవానికి జిల్లా నుంచి సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పుష్కరాల స్నానం కోసం రాజమండ్రికి సుమారు 50వేల మంది భక్తులు తరలివెళ్లారు. రైళ్ల ద్వారా సుమారు 25వేల మంది వెళ్లగా, ట్రావెల్స్ వాహనాల ద్వారా 10వేల మంది, ఆర్టీసీ బస్సుల ద్వారా మరో 15వేల మంది వెళ్లినట్టు ప్రాధమిక లెక్క ద్వారా తెలుస్తోంది. 183ఆర్టీసీ బస్సులు విజయనగరం జిల్లా నుండి నడిచాయి. రిజర్వేషను బస్సులు తప్ప మిగతా వన్నీ స్టాండింగ్తోనే వెళ్లాయి. ఇక, వేయి ప్రైవేటు బస్సులు, జీపులు, మ్యాక్సీల ద్వారా దాదాపు 10వేల మంది భక్తులు తరలి వెళ్లినట్టు ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా పుష్కర ఘాట్లలో స్నానమాచరించడానికి వెళ్లిన వారిలో పలువురు మృతి చెందారని తెలియగానే జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. అదేవిధంగా కలెక్టరేట్లోని డి సెక్షన్ కార్యాలయానికి కూడా కొంత మంది ఫోన్లు చేసి సమాచారం తెలుసుకోవడానికి ఆతృత పడ్డారు.పూర్తి సమాచారం తెలియకపోవడంతో అవస్థలు పడ్డారు. పుష్కరాలకు వెళ్లిన వారి బంధువులు వారి ఆచూకీ కోసం ఫోన్లు చేసి మేము క్షేమంగానే ఉన్నామని తెలియగానే కాస్త ఊరట చెందారు. అదేవిధంగా మృతుల కుటుంబాల వారు, వారి బంధువులు తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. పుణ్యానికి వెళ్లి అసువులు బాసారా అని మృతుల బంధువులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని డీ సెక్షన్ కార్యాలయంలో ఎప్పుడయినా ఉపద్రవాలు ఏర్పడినప్పుడు కంట్రోల్ రూం ఏర్పాటు చేసే వారు. అయితే ఈ సారి మాత్రం కంట్రోల్ రూం ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని డీఆర్వో జితేంద్రే స్పష్టం చేశారు. దీని వలన పలువురు పుష్కర యాత్రికుల బంధువులు ఇబ్బందులు పడ్డారు.