Rajahmundry pushkar ghat
-
పుష్కర విషాదానికి బాధ్యత ప్రభుత్వానిదే
సాలూరు: గోదావరి పుష్కరపనుల్లో కాసులవేటకే ప్రాధాన్యమిచ్చి, భక్తుల ప్రాణాలను ప్రభుత్వం బలిగొందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మం డలి సభ్యుడు రాజన్నదొర మండిపడ్డారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభ సమయంలోనే ఏర్పాట్లలో వైఫల్యం కార ణంగా ఇంతమంది భక్తులు దుర్మరణం చెందారని ఆవేదన వెలిబుచ్చారు. ఈవిషాద ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, వెయ్యి కోట్ల రూపాయలవరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినవస్తున్నాయన్నారు. పనుల్లో అవకతవకలు చేసి కాసులు వెనకేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రణాళిక లేకుండా పుష్కరాలను ప్రారంభించారన్నారు. కుంభమేళాలో కూడా ఇంతటి విషాదం జరగలేదన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, అన్ని ఘాట్లకు భక్తులు వెళ్లేలా చేయకపోవడం, తాగునీటిని కూడా అందించలేకపోవడం వంటి తప్పిదాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. పుష్కర తేదీని నిర్ణయించడంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొనేలా ప్రభుత్వం వ్యవహరిం చిందని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు. ఇకపై పుష్కరాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవడమే కాకుండా మళ్లీ ఇలాంటి విషాదకర ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ నాగార్జున పాల్గొన్నారు. -
పుష్కర స్నానం చేయకముందే పరలోకానికి..
ఒరే బాబూ.. పుష్కరాలకు ఎల్దాంరా... రాజమండ్రి దుర్ఘటనలో జిల్లా వాసులు ముగ్గురు మృతి కోమాలో ఇద్దరు.. మరో ఇద్దరికి గాయాలు దంపతుల ఆచూకీ గల్లంతు విషాదంలో కుటుంబ సభ్యులు, బంధువులు పుష్కర స్నానం చేయకముందే వారు పరలోకానికి వెళ్లిపోయారు. తమవారికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న దుర్ఘటనలో జిల్లాకు చెందిన ముగ్గురు కన్నుమూశారు. మరో ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. దంపతులిద్దరి ఆచూకీ గల్లంతు కాగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాడంగి, బొబ్బిలి : ‘ఒరే బాబు.. గోదావరి పుష్కరాలకు ఎల్దాంరా.. నానెప్పుడు యాత్రలకు ఎల్లినా తీసుకెళ్లే బాబే మల్లీ బస్సేత్తనాడంట... అటునుంచటు దాచ్ఛారామం, సిమ్మాచలం చూసుకొని తిరిగొచ్చేద్దాం.. మళ్లీ ఎప్పుడు పుష్కరాలు వత్తాయిరా.. అమ్మి, నువ్వు, పిల్లలు కూడా బయలుదేరండ్రా’ ఆంటూ తమ వీధిలోని వాళ్లనందరినీ తొందరపెట్టిన ఆ వృద్ధురాలు అంత తొందరగానూ కన్నుమూశారు. రాజమండ్రి ఘటనలో మరణించిన ఆమె పేరు అమలాపురం పైడితల్లి. బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందినవారు. నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్న పైడితల్లితోపాటు కొడుకు, కోడలు, మనుమరాళ్లు కూడా వెళ్లారు. పాల్తేరుకు సమీపంలో ఉన్న అలజంగి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు కర్రి జగదీష్ మూడు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 1300 రూపాయలు టిక్కెట్టు అనేసరికి కుమ్మరి కులానికి చెందిన దాదాపు 15 కుటుంబాలవారు పిల్లాపాపలతో పయనమయ్యారు. గతంలో జగదీష్ వేసిన బస్సుల్లో కాశీ, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లిన పైడితల్లితోపాటు రెండో కొడుకు రమణ, కోడలు లక్ష్మి, మనమరాళ్లు కాంచన, లీల కూడా ఉన్నారు. పైడితల్లి ఇంటి పక్కనే ఉంటున్న 70 ఏళ్ల పూడి పారమ్మ కూడా వీరితోపాటు బయలుదే రారు. సోమవారం సాయంత్రం 43 మంది పాల్తేరు నుంచి బయలుదేరారు. కొత్తవలస వద్ద ఆగి పుళిహోర తిన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు రాజమండ్రి లాలా చెరువు వద్దకు బస్సు చేరింది. అక్కడ నుంచి ఉచిత బస్సులో పుష్కరఘాట్కు వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పైడితల్లి అసువులు బాశారు. మృత్యువుతో ఇద్దరి పోరాటం తొక్కిసలాటలో గాయపడి కోమాలోకి వెళ్లిన పారమ్మ, పొట్నూరు గంగమ్మ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారని గ్రామానికి చెందిన అమలాపురం కృష్ణ విలేకరులతో చెప్పారు. గాయపడిన అమలాపురం నాగమ్మ, పోలి పోలమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే గ్రామానికి చెందిన దంపతులు అంబటి అప్పారావు, సుభద్ర గల్లంతు అవడం, వారి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవటం, ఫోన్ చేస్తున్నా స్పందించకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి టీవీ చూసి తెలుసుకున్నాం మా అమ్మ చనిపోయినట్లు సాక్షి టీవీ ద్వారా తెలిసింది. నిన్న ఇక్కడ నుంచి వెళ్లాక ఎవరూ ఫోను చేయలేదు. ఉదయం 9 గంటలకు అన్నయ్య ఇంటికి ఫోన్ చేసి అమ్మకు బాగోలేదు. ఆస్పత్త్రికి తీసుకెళ్తున్నామన్నారు. అప్పటికే సాక్షి టీవీలో తొక్కిసలాట, చనిపోయిన వారిని చూపిస్తుండడంతో అనుమానం వచ్చి మళ్లీ ఫోన్ చేస్తే నిజమేనని చెప్పారు. -రామారావు, మృతురాలు పైడితల్లి కొడుకు, పాల్తేరు వద్దంటే వెళ్లింది.. ఈ వయసులో యాత్రలు వద్దన్నా వినకుండా వెళ్లింది. తనకు వస్తున్న పింఛను డబ్బు దాచుకుని బయలుదేరింది. వీధి వారంతా ఉన్నారు కదా ఏమీ అవదనుకున్నాం. ఆస్పత్రిలో అమ్మ ఎలాగుందో.. ఏమిటో.. -సింహాచలం, పారమ్మ రెండో కొడుకు, పాల్తేరు సత్యవతి ఇంటి వద్ద అలముకున్న విషాదం విజయనగరం క్రైం: రాజమండ్రి ఘటనలో పట్టణంలోని కోరాడవీధికి చెందిన కోచ్చెర్లపాటి సత్యవతి (62) మృతిచెందడంతో ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యవతి కోరాడ వీధిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. భర్త అప్పలరాజు మృతి చెందడంతో పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. ఈ ప్రాంతం నుంచి 40 మంది నాలుగు వాహనాల్లో సోమవారం రాత్రి బయల్దేరి వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో సత్యవతి మరణించారు. ఈ విషయాన్ని తోటివారు ఆమె కుమారుడు రవికుమార్రాజుకు తెలియజేశారు. రాజు చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ మరణించటంతో ఒంటరిగా మిగిలిపోయారు. రవికుమార్రాజుకు చెల్లి శ్రీలత ఉంది. ఆమెకు వివాహం చేశారు. రవికుమార్రాజుకు ఇంకా పెళ్లికాలేదు. అతని పెళ్లి చూడకుండానే తల్లి మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. సత్యవతి మృతదేహాన్ని తీసుకొస్తున్నామని బంధువులు తెలిపారు. నివ్వెరపోయిన అవ్వపేట భోగాపురం: మండలంలోని సవరవిల్లి పంచాయతీ అవ్వపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు బంగారమ్మ, గౌరిలు రాజమండ్రి పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసటలో మరణించటంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. అవ్వపేట గ్రామానికి చెందిన అవ్వ కృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. విశాఖపట్నం మారికవలసలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు మంజూరవడంతో భార్య పిల్లలతో సహా అక్కడే ఉంటున్నారు. గోదావరి పుష్కరాలకు భార్య బంగారమ్మ (35), కుమార్తె గౌరి(14), కుమారుడు రాంబాబుతో కలిసి సోమవారం వెళ్లారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో బంగారమ్మ, కుమార్తె గౌరి మరణించారు. విషయం తెలియగానే గ్రామంలో విషాదం అలముకుంది. ఏఎంసీ మాజీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ పట్న రామనర్సయ్యమ్మ, ఎంపీటీసీ సభ్యుడు పట్నతాతయ్య తదితరులు కృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతదేహాలను బుధవారం గ్రామానికి తీసుకురానున్నారు. -
కన్నీటి గోదారి!
తల్లి గోదారి పరవళ్లు చూద్దామని వారు బయల్దేరారు. ఆ పుణ్యనదీఝరిలో స్నానం చేసి తరిద్దామని ఎంతో ఆశపడ్డారు. నూట నలభై నాలుగేళ్లకు ఓ సారి వచ్చే మహా పుష్కరాల్లో ఆ జీవనది వైభవాన్ని కళ్లారా చూడాలని ఎంతగానో తపించారు. కానీ వారికేం తెలుసు... ఆ తల్లి చెంతనే మృత్యువు తమ కోసం మాటువేసి ఉందని, ఆ పుష్కర యాత్రే తమకు అంతిమ యాత్ర అవుతుందని. రాజమండ్రి పుష్కర ఘాట్లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందారు. ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గోదారి ఒడ్డునే ఊపిరి వదిలిన ఈ భక్తులను చూసి జిల్లా కన్నీళ్లు పెట్టింది. ఉదయం నుంచి పుష్కర సంబరాలు చూద్దామని టీవీలకు అతుక్కుపోయిన భక్తులను ఒక్కసారిగా విషాదం ఆవహించింది. వెంటవెంటనే మృతుల సంఖ్య పెరుగుతుండడంతో తమ వారి పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలో ప్రారంభమైంది. ఫోన్లు చేసిన తమ వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. మరికొందరు టీవీల ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకొందరు ఆ వార్తలను చూడలేక టీవీలను ఆపివేశారు. అయినా అందరిలో ఒకటే ఆతృత. పుణ్యం కోసం వెళ్లిన వారికి ఎందుకీ ఆపదవచ్చిందని ఆవేదన చెందారు. మృతి చెందిన ముగ్గురూ మహిళలే, అందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే... సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో పుణ్య స్నానమాచరిద్దామని వెళ్లిన జిల్లాకు చెందిన పుష్కర యాత్రికులకు చావు ఎదురైంది. గోదావరిలో మునిగి పుణ్యం మూట కట్టుకుని వచ్చే తమవారిని చూసి తరిద్దామనుకున్న కుటుంబ సభ్యులు బంధువుల మృత దేహాల మూటలు చూడాల్సి వస్తుందనుకోలేదని బోరున విలపిస్తున్నారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. బాడంగి మండలం పాల్తేరుకు చెందిన అమలాపురం పైడితల్లి, కొత్త వలస మండలం తుమ్మికాపల్లి గేట్ వద్ద నివసిస్తున్న ఆరిపాక నారాయణమ్మ తొక్కిసలాటలో మృతి చెందగా, విజయనగరానికి చెందిన కుచ్చర్ల పాటి సత్యవతిలు తొక్కిసలాట నేపథ్యంలో ఊపిరాడక మృతి చెందారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ పాల్తేరు గ్రామానికి చెందిన పూడి పారమ్మ, పొట్నూరి గంగమ్మ కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. అదే గ్రామానికి చెందిన పోలి పోలమ్మ, అమలాపురం నాగమ్మ గాయపడగా, అంబటి అప్పారావు, సుభద్ర దంపతులతో పాటు ఆయన కుమారుడు పైడిరాజులు గల్లంతయ్యారు. అలాగే జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్లోని బొగ్గుల దిబ్బకు చెందిన అలబోయిన కాంతమ్మ సోమవారం అర్ధరాత్రి రెలైక్కుతూ జారిపడి తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందింది. ఇలా పుష్కరాలకు వెళ్లిన వారికి ఇలా చావులు రావడమేంటని ఆయా కుటుంబాలకు చెందినవారు రోదిస్తున్నారు. జిల్లానుంచి వేలాది మంది పుష్కర యాత్రకు వెళ్తున్నప్పటికీ మొదటి రోజు పుష్కర స్నానం చేసి వద్దామని బయలు దేరిన వారు ఇలా ప్రమాదంలో మృతి చెందడం, గాయాల పాలు కావడం అందర్నీ కలవర పరచింది. గత ఏడాది ఇదే సీజన్లో చెన్నైలో 24 మంది జిల్లాకు చెందిన వలస కూలీలు భవనం కూలిన ఘటన నుంచి తేరుకోక ముందే ఇలా ఇతర జిల్లాలో జిల్లాకు చెందిన వారు మృతి చెందారని తెలిసిన జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. ఏ మండలానికి చెందిన వారు మృతి చెందారు? ఏఏ గ్రామాల వారు? ఎంత మంది ఉంటారన్న ప్రశ్నలు, ఆచూకీ తీస్తూ క్షణ క్షణం ఉత్కంఠకు గురయ్యారు జిల్లా వాసులు. పుష్కర యాత్రకు వెళ్లిన వారిలో పాల్తేరుకు చెందిన వారే 80 మంది ఉన్నారు. వీరిలో తలా ఒక వైపు పుష్కర ఘాట్లలో స్నానమాచరిస్తున్నారు. జిల్లా నుంచి 50 వేల మంది వాస్తవానికి జిల్లా నుంచి సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పుష్కరాల స్నానం కోసం రాజమండ్రికి సుమారు 50వేల మంది భక్తులు తరలివెళ్లారు. రైళ్ల ద్వారా సుమారు 25వేల మంది వెళ్లగా, ట్రావెల్స్ వాహనాల ద్వారా 10వేల మంది, ఆర్టీసీ బస్సుల ద్వారా మరో 15వేల మంది వెళ్లినట్టు ప్రాధమిక లెక్క ద్వారా తెలుస్తోంది. 183ఆర్టీసీ బస్సులు విజయనగరం జిల్లా నుండి నడిచాయి. రిజర్వేషను బస్సులు తప్ప మిగతా వన్నీ స్టాండింగ్తోనే వెళ్లాయి. ఇక, వేయి ప్రైవేటు బస్సులు, జీపులు, మ్యాక్సీల ద్వారా దాదాపు 10వేల మంది భక్తులు తరలి వెళ్లినట్టు ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా పుష్కర ఘాట్లలో స్నానమాచరించడానికి వెళ్లిన వారిలో పలువురు మృతి చెందారని తెలియగానే జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. అదేవిధంగా కలెక్టరేట్లోని డి సెక్షన్ కార్యాలయానికి కూడా కొంత మంది ఫోన్లు చేసి సమాచారం తెలుసుకోవడానికి ఆతృత పడ్డారు.పూర్తి సమాచారం తెలియకపోవడంతో అవస్థలు పడ్డారు. పుష్కరాలకు వెళ్లిన వారి బంధువులు వారి ఆచూకీ కోసం ఫోన్లు చేసి మేము క్షేమంగానే ఉన్నామని తెలియగానే కాస్త ఊరట చెందారు. అదేవిధంగా మృతుల కుటుంబాల వారు, వారి బంధువులు తీవ్ర మనోవేదనలో మునిగిపోయారు. పుణ్యానికి వెళ్లి అసువులు బాసారా అని మృతుల బంధువులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని డీ సెక్షన్ కార్యాలయంలో ఎప్పుడయినా ఉపద్రవాలు ఏర్పడినప్పుడు కంట్రోల్ రూం ఏర్పాటు చేసే వారు. అయితే ఈ సారి మాత్రం కంట్రోల్ రూం ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని డీఆర్వో జితేంద్రే స్పష్టం చేశారు. దీని వలన పలువురు పుష్కర యాత్రికుల బంధువులు ఇబ్బందులు పడ్డారు.