మంత్రి జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రాంత మంత్రులు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహన్ను కలిశారు.
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రాంత మంత్రులు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహన్ను కలిశారు. విభజన బిల్లు వచ్చిందని... అసెంబ్లీలో ప్రకటన చేయాలని వారు ఈ సందర్భంగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. బిల్లు ప్రతులను సభ్యులందరికీ అందచేయాలని కోరారు. తక్షణమే బీఏసీని సమావేశపరిచి విభజన బిల్లుపై సభలో చర్చించేలా అజెండాను ఖరారు చేయాలని సూచించారు.
అంతకు ముందు టీ.మంత్రులు జానారెడ్డి ఛాంబర్లో భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నానికి బిల్లు ప్రతులు అసెంబ్లీకి వస్తాయని జానారెడ్డి తెలిపారు. సభ ఎన్నిరోజులు జరగాలన్న విషయంపై బీఏసీ సమావేశంలో చర్చకు వస్తుందని అన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిల్లుపై సభలో చర్చకు పట్టుపట్టనున్నారు.
సీఎంను కలిసి తెలంగాణ ఎమ్మెల్సీలు
తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు. తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చించాలని కోరారు. చర్చపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ఈ సందర్బంగా తెలిపారు. మరో గంటలో సభ్యులకు బిల్లు ప్రతులను అందచేస్తామన్నారు.