
భక్తులను కూర్చోబెట్టి అన్నవడ్డన చేయిస్తున్న ఈవో
సింహాచలం(పెందుర్తి): ‘భక్తులకు బఫే పద్ధతిలో అన్నప్రసాదమా? కూర్చోపెట్టి వడ్డించాలని పదేపదే ఎందుకు చెప్పించుకుంటారు? పద్ధతి మార్చరా?’ అంటూ సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ నిత్యాన్నదాన పథకం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహగిరి నిత్యాన్నదాన భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. బఫే పద్ధతిలో అన్నప్రసాదం వడ్డించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పలు కారణాలను ఆయనకు తెలిపారు.
ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకోవాలని, భక్తులకు కూర్చోపెట్టే వడ్డన చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు జరుగుతున్న బఫే పద్ధతిని ఆపి భక్తులందరినీ కూర్చోపెట్టి అన్నవడ్డన చేయించారు. అన్నప్రసాదాలు తీసుకెళ్లే తోపుడు బళ్లు పనిచేయడం లేదని, సరిపడా మెన్ రాలేదని అధికారులు చెప్పడంతో వెంటనే వాటిని సరిదిద్దాలని ఆదేశించారు.