స్థలం కనిపిస్తే అమ్మేస్తారు | Police have arrested two persons | Sakshi
Sakshi News home page

స్థలం కనిపిస్తే అమ్మేస్తారు

Aug 25 2015 11:37 PM | Updated on Apr 3 2019 8:28 PM

స్థలం కనిపిస్తే అమ్మేస్తారు - Sakshi

స్థలం కనిపిస్తే అమ్మేస్తారు

వివాదంతో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అమ్మేస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని ఆరిలోవ పోలీసులు

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
 
 ఆరిలోవ(విశాఖ) : వివాదంతో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అమ్మేస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు మంగళవారం స్టేషన్ ఆవరణలో కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆదర్శనగర్‌కు చెందిన జె.రమేష్, గాంధీనగర్‌కు చెందిన సతీష్‌కుమార్, ఆరిలోవకాలనీకి చెందిన పి.రామారావు స్నేహితులు. వీరు ముగ్గురు నగ రు శివారులో పలుచోట్ల వివాదంలో ఉన్న స్థలాలను ముందుగా గుర్తిస్తారు. వాటిని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. అనంతరం వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు.

ఇలా పీఎంపాలెంలో ఓ స్థలం విక్రయిస్తామని మూడోవార్డు కార్పొరేటర్ నల్లూరి భాస్కరరావు నుంచి రూ.10 లక్షలు, మధురవాడ దరి మిథిలాపురి వుడా కాలనీలో స్థలం అమ్ముతామంటూ మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన నుంచి రూ.17 లక్షలు అడ్వాన్స్‌గా వసూలు చేశారు. వీటితోపాటు రుషికొండ దరి రామానాయుడు ఫిల్మ్ స్టూడియో వద్ద 2,000 చదరపు గజాల స్థలాన్ని చదును చేయించి హైదరాబాద్ చెందిన ఓ పార్టీకి అమ్మకానికి పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మూడోవార్డు పరిధి ఆదర్శనగర్‌లో ఓ స్థలం యజమాని హెన్స్ కుమార్ ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో రూ. 10లక్షలు డిమాండ్ చేశాడు.

దీంతో ఆయన ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అక్రమాలన్నీ బయటపడడంతో వారిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. వారిలో రమేష్, సతీష్‌లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మూడో వ్యక్తి రామారావు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ధనుంజయనాయుడు, ఎస్‌ఐ కాంతారావు, ఏఎస్‌ఐలు బ్రహ్మాజీ, కాళీ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement