మోదీ ఎన్నికల తాయిలాలను  జనం నమ్మరు | People do not belive modi - ap cm chandra babu | Sakshi
Sakshi News home page

మోదీ ఎన్నికల తాయిలాలను  జనం నమ్మరు

Feb 1 2019 2:11 AM | Updated on Feb 1 2019 2:11 AM

People do not belive modi  - ap cm chandra babu - Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రైతులకు నేరుగా నగదు బదిలీతోపాటు ఎన్ని హామీలిచ్చినా జనం ఆయన్ను నమ్మరని చెప్పారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రధాని రాష్ట్రానికి పదిసార్లు వస్తారని, అమిత్‌ షా కూడా వస్తారని వ్యాఖ్యానించారు. మోదీ వల్లే ఏపీకి కియా మోటార్స్‌ వచ్చిందని అబద్ధాలాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీకి మేలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలన్నారు. తమపై వచ్చే ఆరోపణలు, విమర్శలపై ఎమ్మెల్యేలు జవాబివ్వాలని సూచించినా కొందరు అసలు స్పందించడం లేదని తప్పుబట్టారు.  రాబోయే 75 రోజులకు సంబంధించి తాను నిర్దేశించిన ఎజెండా ప్రకారం పనిచేయాలన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలని ఆదేశించారు. 

భృతి పెంపుపై అసెంబ్లీలో ప్రకటన..
నిరుద్యోగ భృతిని రూ. వెయ్యి నుంచి రూ.రెండు వేలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని, అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేస్తానని చంద్రబాబు చెప్పారు. రైతులు, కౌలు రైతులకు త్వరలో పథకాన్ని ప్రకటిస్తానని, ఇంకా వినూత్నమైన కార్యక్రమాలను ప్రకటిస్తానని తెలిపారు. వీటన్నింటినీ ఉపయోగించుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ సమావేశాల్లోనే బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత, కాపు రిజర్వేషన్ల బిల్లులను ఆమోదిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహిస్తున్న బంద్‌కు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు స్పష్టం చేశారు. 

బాబు యాత్రలపై త్వరలో నిర్ణయం.. 
టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు బస్సు యాత్ర చేయాలని చంద్రబాబుకు సూచించగా మరికొందరు రోడ్‌ షో అయితే బాగుంటుందని చెప్పారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల చొప్పున ప్రచారం చేయాలన్న సూచనలపై త్వరలో నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు. ఫిబ్రవరి పదో తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని చెప్పారు. ఏడు జిల్లాల్లో ఈ షెడ్యూల్‌ అమలులో ఉంటుందన్నారు. మార్చి మొదటి వారంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ఈలోపే ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 11న ఢిల్లీలో తాను చేపట్టే దీక్షకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలన్నారు. 12న రాష్ట్రపతిని కలిసేందుకు రావాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement