
ఏఈ కృష్ణారావు (ఎడమ వైపు వ్యక్తి) ని విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు గుంటూరు
గుంటూరు, ఆగిరిపల్లి (నూజివీడు) : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ముసునూరు ఏఈగా పని చేస్తున్న జి.కృష్ణారావు కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.9 వేలు డిమాండ్ చేసి, నూజివీడులోని పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో తన రూమ్లో వాటిని తీసుకోగా, విజయవాడ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఏసీబీ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముసునూరు మండలం గుడిపాడు బీసీ కాలనీలో గ్రావెల్ రోడ్డు నిర్మాణం నిమిత్తం జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.2 లక్షలు మంజూరు కాగా, పనిని అదే గ్రామానికి చెందిన గద్దె రఘుబాబు చేపట్టి పూర్తి చేశాడు.
ఈ పనికి సంబంధించి ఎం.బుక్ నమోదు చేసి ఈఈకి పంపించడానికి ఏఈ జి.కృష్ణారావు రూ.9 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రఘుబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు చెప్పినట్లుగా గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో కాంట్రాక్టర్ రూ.9 వేలు తీసుకొచ్చి ఏఈ కృష్ణారావుకు ఇవ్వగా వాటిని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని చొక్కా జేబులో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని చేతులను ద్రావకంతో కడగగా అవి రంగు మారాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎస్. వెంకటేశ్వరరావు, కే.వెంకటేశ్వర్లు, ఎస్వీ రమేష్బాబు, హ్యాపీ కృపానందం, సీ కెనడీ, రామచంద్రరావు పాల్గొన్నారు.
డెప్యుటేషన్పై వచ్చి..ఏసీబీకి చిక్కి..
ఏసీబీకి చిక్కిన కృష్ణారావు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో పని చేస్తూ ముసునూరు ఏఈగా డెప్యూటేషన్పై వచ్చారు. అక్కడ ఏఈగా పని చేస్తూనే మరల ఆగిరిపల్లి మండలానికి కూడా పంచాయతీరాజ్ ఏఈగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గ్రావెల్ రోడ్డుకు బిల్లు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి ఇలా ఏసీబీకి చిక్కారు.