తోటపల్లి పేరు వింటే వైఎస్సార్ గుర్తుకొస్తారు...
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
ప్రజాసంకల్పయాత్ర బృందం: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పేరు చెప్పగానే కురుపాం నియోజకవర్గంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రైతులు, ప్రజలకు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి గుర్తుకొస్తారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఆదివారం ఆమె మాట్లాడారు. లక్షలు ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే తోటపల్లి ప్రాజెక్టును శరవేగంగా పనులు జరిపించిన ఘనత మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గ ప్రజల, రైతులు గుండెల్లో దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.
అందుకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలోని అడుగు పెట్టగానే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న పాదయాత్ర కురుపాం నియోజకవర్గంలో 300 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో అదృష్టమని ఈ సంఘటన నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ నెల 20న కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ ఉందని, ఆ సభకు నియోజకవర్గంలోని మహిళలు, రైతులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.