కరోనా: నలభై దాటితే అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

కరోనాపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Published Fri, Jun 19 2020 6:43 PM

Jawahar Reddy Adviced Those Over 40 To Be Vigilant On Corona - Sakshi

సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు కూడా కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్‌ జవహర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధింత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా తక్షణమే సమీపంలో వైద్యులను సంప్రదించాలన్నారు. ‘104’ టోల్‌ ఫ్రీ నంబర్‌, వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ ‘14410’ నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. వెంటనే స్థానిక ఆశా వర్కర్‌, వార్డు వాలంటీర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. గతంలో ఆస్తమా, ఆయాసం ఉన్నా ఏమీ కాలేదన్న ధీమా ను విడనాడాలని జవహర్‌రెడ్డి అన్నారు. (అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు..) 

బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారితో పాటు, హై రిస్క్ గ్రూపునకు చెందినవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరిలో శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గరలోని కొవిడ్ కేర్ సెంటర్‌లో తక్షణం సంప్రదించాలన్నారు. వారికి పరీక్షలు చేసి తగిన వైద్యసేవల్ని అందిస్తారన్నారు. అవసరమైతే ఐసోలేషన్‌కు తరలిస్తారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి 40 నుండి 49 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 14 మంది, 50 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు 22 మంది మరణించారని జవహర్‌రెడ్డి తెలిపారు. (ఏపీలో మరో 376 కరోనా కేసులు)

Advertisement
Advertisement