‘జన్మభూమి’తో ధన్యం | 'Janmabhumito dhanyam | Sakshi
Sakshi News home page

‘జన్మభూమి’తో ధన్యం

Oct 3 2014 12:44 AM | Updated on May 3 2018 3:17 PM

ప్రజల సమస్యల పరిష్కారానికే రాష్ట్రప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం తలపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

  •  సమస్యల పరిష్కారానికే..
  •  గతంలో సత్ఫలితాలు
  •  మంత్రి అయ్యన్నపాత్రుడు
  •  బీచ్‌రోడ్డులో ప్రారంభం
  • విశాఖపట్నం : ప్రజల సమస్యల పరిష్కారానికే రాష్ట్రప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమం తలపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖ ఆర్‌కే బీచ్ ఎన్టీయార్ విగ్రహం వద్ద గురువారం ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ గతంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. అధికారులు స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని  పరిష్కరిస్తారని తెలిపారు. అర్హులకు పింఛన్లు ఇస్తారని, అనర్హులను తొలగిస్తారని స్పష్టం చేశారు.

    ఇందుకు  కారణాలను గ్రామ సభల్లో అధికారులు వివరిస్తారని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ‘స్వచ్ఛ్ భారత్’లో మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ శిబిరాలు నిర్వహించి నిరుపేదలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. పశువులకు వైద్యసేవలు కల్పిస్తామని చెప్పారు. పొదుపు సంఘాల మహిళలకు వృత్తినైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు.

    పొలం పిలుస్తోంది,  బడి పిలుస్తోంది కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎన్టీయార్ విగ్రహానికి మంత్రులు,  అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎంసీఏ వరకు జన్మభూమి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్‌రోడ్డు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. అక్కడ అధికారులు,  ప్రజాప్రతినిధులు,  విద్యార్థులు పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేశారు.

    కార్యక్రమంలో ఎంపీలు అవంతి శ్రీనివాసరావు,  కె.హరిబాబు,  ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు, డీఆర్‌డీఏ పీడీ వి.సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములునాయుడు పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement