అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు | hundred lies for getting ruling | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు

Sep 12 2014 2:55 AM | Updated on Jul 28 2018 6:33 PM

అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు - Sakshi

అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు

వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు.

కడప కార్పొరేషన్: వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మేయర్ కె. సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి గురువారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ  వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా  నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు.
 
కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు.  రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా... అని ఆయన ప్రశ్నించారు.  రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి  నోటీసులు వచ్చాయన్నారు.  వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు.
 
సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.  అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై  అధికార పక్షం  అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి  విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై  అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు.
 
ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించకుండా గొంతునొక్కడం దుర్మార్గమన్నారు.  సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీనాయకులు యానాదయ్య, కరీముల్లా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement