ఉసూరుమనిపింఛెన్! | don't given to new pinchan | Sakshi
Sakshi News home page

ఉసూరుమనిపింఛెన్!

Jul 14 2016 1:29 AM | Updated on Aug 20 2018 3:09 PM

సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు సామాన్యులపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి.

దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇక రావు
ఆగిపోయిన సదరన్ క్యాంపులు
క్యాంపులకు రూ.25 లక్షలు బకాయి పడ్డ ప్రభుత్వం
దరఖాస్తుదారుల్లో ఆందోళన

 
చిత్తూరు (అర్బన్): సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు సామాన్యులపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. జిల్లాలో మూడు రోజులు గా సదరన్ క్యాంపులు నిర్వహించకపోవడంతో కొత్తగా (దివ్యాంగులు) వికలాంగుల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. దివ్యాంగుల సమాచారం సేకరించి, సదరు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించే అంశాన్ని అధికారులు పట్టించుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
 
ఇదేనా భరోసా..?
 గత రెండేళ్ల కాలంలో 2014 అక్టోబరు, గత ఏడాది జనవరిలో మాత్రమే జిల్లాలో కొత్త పింఛ న్లు మంజూరు చేశారు. 2015 ఫిబ్రవరి తర్వాత  ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కొత్త పింఛన్ల కోసం జిల్లా నుంచి ఏడాదిన్నరకాలంలో  1.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లల్లో వికలాంగ పింఛన్ల కోసం ఏకంగా 56 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే  పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ముందు వికలాంగులు సదరన్‌క్యాంపులకు వెళ్లాలి. ఇక్కడ వైద్యులు, సదరన్ ఉద్యోగుల సమక్షంలో వైకల్యం పరిశీలించి ధృవీకరణ పత్రాలను అందిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, తదితర విషయాలను సదరన్ సిబ్బందే నిర్వహించా లి. కానీ ఏడాదిన్నరగా  జిల్లాలోని సదరన్ క్యాంపులకు ప్రభుత్వం రూ.25 లక్షల బకాయిలు విడుదల చేయలేదు. దీంతో క్యాంపు నిర్వాహకులు ఉన్నఫలంగా సదర్ వెబ్‌సైట్‌ను తొలగించి, మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వికలాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేశారు.
 
ఆగిన క్యాంపులు..
జిల్లాలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి, మదనపల్లె ఏరియా ఆస్పత్రి, తిరుపతి రుయా ఆసుపత్రుల్లో  రోజూ సదరన్ క్యాంపులు నిర్వహించేవాళ్లు. సోమ, మంగళ, శుక్రవారాల్లో ఎముకల వైకల్యం సర్టిఫికెట్లు, గురువారం ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, శనివారం మానసిక వైకల్యం ఉన్న వాళ్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. ఇక కార్డియో (గుండె), న్యూరాలజీ (నరాలు)కు సంబంధించి  ప్రైవేటు వైద్యులను పిలిపించి వాళ్లకు రోజువారి వేతనాలు చెల్లించి శిబిరాలు నిర్వహించేవారు. భారీగా పేరుకున్న బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అన్ని చోట్ల సదరన్‌క్యాంపులు ఆపేస్తునట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
 
 అధికారుల ఆదేశంతోనే..
 క్యాంపుల నిర్వాహణ పూర్తిగా ఆర్థికపరమైన అంశం. డబ్బులిస్తే గానీ ప్రైవేటు వైద్యులు రారు. సిబ్బందికి వేతనాలు రావడం లేదు. దీంతో ఉన్నతాధికారులు క్యాంపు లు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసే వెబ్‌సైట్ కూడా ఎత్తేశారు.  -రవి, జిల్లా ప్రాజెక్టు మేనేజరు, సదరన్.
 
 
 కోత మొదలెట్టారు
టీడీపీ అధికారంలోకి రాకముందు వరకు జిల్లాలో దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులకు  వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు అందేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటి వరకున్న రూ.200ల పింఛన్ రూ.1000లకు పెంచారు. వికలాంగులకయితే రూ.1000 నుంచి రూ.1500లకు  పెంచారు. కానీ పింఛన్ల లబ్ధిదారులను భారీగా తొలగించారు. 5 లక్షల పింఛన్లను ఒక్కసారిగా 3.86 లక్షలకు కుదించేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement