లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ లేదు

Beneficiaries have no biometric for Ration Goods - Sakshi

వీఆర్వో బయోమెట్రిక్‌తోనే రేషన్‌ సరుకులు

కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు 

ప్రజలు గుమిగూడకుండా నలుగురు చొప్పున మాత్రమే అనుమతి

మాస్క్‌లు పెట్టుకోవడం తప్పనిసరి

29 నుంచి సరుకుల పంపిణీ 

4న వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే రూ.1,000 నగదు సాయం

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా సరుకుల పంపిణీ సమయంలో నలుగురు చొప్పున మాత్రమే లబ్ధిదారులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకులను వీఆర్వో బయోమెట్రిక్‌ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గతంలో ఈ–పాస్‌ ద్వారా లబ్ధిదారుడి వేలిముద్రలు తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ రద్దు చేసినట్లు చెప్పారు.

- రేషన్‌ డీలర్లు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రం చేసుకునేందుకు రేషన్‌ షాపుల వద్ద సబ్బు/శానిటైజర్, నీళ్లు  అందుబాటులో ఉంచాలి.
- సబ్సిడీ సరుకుల కోసం వచ్చే కార్డుదారులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేదా ముఖానికి టవల్‌ కట్టుకోవాలి.
- సరుకుల కోసం లబ్ధిదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 29వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు ఏప్రిల్‌ నెల కోటా సరుకులు పంపిణీ చేస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేషన్‌ షాపుల వద్ద నలుగురు చొప్పున లబ్ధిదారులను విడతలవారీగా అనుమతిస్తాం.
- కార్డుదారులకు బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తాం.
- మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15 వరకు సరుకుల పంపిణీ కోసం రేషన్‌ షాపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి.
- రేషన్‌ షాపుల వద్ద అత్యవసర వైద్య సేవల నంబర్లు ప్రదర్శించాలి.
- ఏప్రిల్‌ 4వ తేదీన వలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రూ. 1,000 చొప్పున నగదు సాయం అందజేస్తాం.
- ఈసారి వీఆర్వో బయోమెట్రిక్‌ ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. వీఆర్వోలు రేషన్‌ షాపుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top