సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం

AP CM YS Jagan Cancel Bauxite Mining In Visakha Agency - Sakshi

ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తూ నిర్ణయం

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పర్యటన తప్పనిసరి

కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.

కాగా వైఎస్‌ జగన్‌ గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలన్నారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని చూరగొనాలని సీఎం ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top