నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు (73 మ్యాచ్ల్లో) పూర్తి చేసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ 77 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించగా.. సందీప్ నాలుగు మ్యాచ్లు ముందుగానే ఈ మైలురాయిని తాకాడు.
ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో సందీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతడు 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు (జార్జ్ మున్సే, బ్రెండన్ మెక్ముల్లెన్, మాథ్యూ క్రాస్) తీశాడు. సందీప్తో పాటు లలిత్ రాజ్వంశీ (8-0-32-4) కూడా రాణించడంతో తొలుత బౌలింగ్ చేసిన నేపాల్ స్కాట్లాండ్ను 194 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రోహిత్ పౌడెల్ (74 నాటౌట్), ఇషాన్ పాండే (55) రాణించడంతో 38.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా సందీప్దే..!
అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ 100 వికెట్స్ రికార్డు కూడా సందీప్ ఖాతాలోనే ఉంది. ఈ ఘనతను అతడు కేవలం 42 మ్యాచ్ల్లోనే సాధించాడు. తాజాగా 150 వికెట్ల మార్క్ను కూడా అత్యంత వేగంగా చేరుకొని వన్డే క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.


