ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 18) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ సైతం ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ గుజరాత్ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది.
అంతకుముందు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకోగా.. మిగిలిన బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, కేకేఆర్, సీఎస్కే జట్లు పోటీలో మిగిలాయి.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేసిన ఓ పని సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటమి బాధలో ఉన్న సీఎస్కే అభిమానులను ఇషాన్ విజిల్ వేసి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా 'మీ పని అయిపోంది, ఇక ఇంటికి వెళ్లండి' అని అర్దం వచ్చేలా సైగలు చేశాడు. ఈ చర్య నెట్టింట హాట్టాపిక్గా మారింది.
Good team win that's it well played Ishan Kishan👏👏👏 pic.twitter.com/sfEtoeorOk
— jaguar (@rrd4859) May 18, 2026
ఇషాన్ చర్యను చాలామంది తప్పుడబడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరమా అంటున్నారు. సీఎస్కే అభిమానులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంతమైదానంలో (చెపాక్ స్టేడియం) ఇషాన్ తమను గేలి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
సీఎస్కే అభిమానులను విజిల్ వేసి రెచ్చగొట్టడం ఈ సీజన్లో ఇది రెండోసారి. కొద్ది రోజుల కిందట గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. సీఎస్కేపై విజయానంతరం పసుపు రంగు విజిల్తో ఫోటో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాడు.
సీఎస్కే అభిమానులను ఇలా ట్రోల్ చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఓడిన జట్టు అభిమానుల పట్ల హుందాగా ప్రవర్తించాలి కానీ, ఇలాంటి రెచ్చిగొట్టే ప్రయత్నాలు చేయకూడదని హితవు పలుకుతున్నారు. విజిల్ పోడు అనేది సీఎస్కే నినాదం అన్న విషయం తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 180 పరుగులు చేసింది. ఛేదనలో హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఇషాన్ కిషన్, క్లాసెన్ మ్యాచ్ను మలుపు తిప్పారు.
ముఖ్యంగా ఇషాన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన ఇషాన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. రుతురాజ్ సారథ్యంలోని ఈ జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


