డెహ్రాడూన్: బీజేపీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భువన్ చంద్ర ఖండూరీ(91)మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోసంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఖండూరీ డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఖండూరీకి భార్య అరుణ, కుమారుడు మనీశ్, కుమార్తె రితూ ఉన్నారు. కాగా, రితూ ఖండూరీ భూషణ్ ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ గెలుపుతో 2007లో మొదటిసారిగా ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2009 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఐదు లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓటమి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. 2011లో బీజేపీ తిరిగి ఆయన్ను సీఎంగా నియమించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రిగాను ఖండూరీ పనిచేశారు. రాజకీయాల్లోకి రాకమునుపు భారత సైన్యంలో మేజర్ జనరల్గా పనిచేశారు. జనరల్ సాహబ్గా ఆయన అందరికీ సుపరిచితుడు. క్రమశిక్షణ కలిగిన పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఖండూరీ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు.


