పంజాబ్లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.
(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)
హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.
అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్జిత్ సింగ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా)


