రూ.750 కోట్లకు డౌన్
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం
పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ. 3 చొప్పున పెంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) రోజువారీ నష్టాలు పావు శాతం మేర తగ్గాయి. రోజుకు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 750 కోట్లకు దిగి వచ్చాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలోనే ఉండటం, బలహీన రూపాయి కారణంగా రిటైల్ స్థాయిలో ఆదాయ నష్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, అసలు కన్నా తక్కువ రేటుకే ఇంధనాలను విక్రయిచండం వల్ల ఆయిల్ కంపెనీలకి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ప్రతిపాదనేదీ ఇంకా పరిశీలనలో లేదని శర్మ వివరించారు.
లీటరుకు రూ.3 పెంపు వల్ల ఓఎంసీలకు పరిమిత ఊరటే లభిస్తుందే తప్ప నష్టాలు పూర్తి స్థాయిలో భర్తీ కావని, దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా కొంత పెరుగుతాయని విశ్లేషకులు తెలిపారు. రేట్లు పెరగడం వల్ల డిమాండ్ స్వల్పంగా నెమ్మదించి, దిగుమతుల భారం కొంత తగ్గుతుందని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు తెలిపారు. ద్రవ్యోల్బణం 15–25 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చన్నారు. క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే ఓఎంసీలను తిరిగి లాభాల వైపు మళ్లించేందుకు ఈ పెంపు సరిపోదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అనలిస్ట్ ప్రశాంత్ వశిష్ట తెలిపారు. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, రేట్లు కొంత పెరగడంతో ఓఎంసీల ఆదాయ నష్టాలు పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై రూ. 13కి నెమ్మదిస్తాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి మే ఆఖరు వరకు వ్యవధిలో నష్టాలు రూ. 1 లక్ష కోట్ల పైగా ఉండొచ్చని వివరించారు.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


