‘నేను ఏ తప్పూ చేయలేదు’

తాను ఏ తప్పూ చేయలేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ తెలిపారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒత్తిడితోనే తనను అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పారు. చింతమనేని రోడ్‌షోలో మాట్లాడిన వీడియోని తాను ఎక్కడా మార్ఫింగ్‌ చేయలేదని చెప్పారు. చింతమనేని మాట్లాడిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే వాట్సప్‌లో షేర్‌ చేసినట్లు వెల్లడించారు. చింతమనేని ప్రభాకర్‌ దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే అతనిని వదిలేసి, వీడియో అందరికీ తెలిసేలా షేర్‌ చేసిన తనపై కేసు పెట్టడం దారుణమన్నారు.‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు.........కొడకల్లారా’  అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించి వీడియో షేర్‌ చేసిన కత్తుల రవి అనే వైఎస్సార్‌సీపీనేతను హడావిడిగా అరెస్టు చేశారు. ఈ ఘటనతో పోలీసుల వైఖరిపట్ల దళిత సంఘాలు, వర్గాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చింతమనేని దిష్టిబొమ్మతో పాటు టీడీపీ జెండాలను దళితులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

కోర్టుకు తీసుకెళ్లకుండా డ్రామాలాడుతున్న పోలీసులు
కత్తుల రవిని ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి కోర్టుకు తరలించడంలో కూడా పోలీసులు హైడ్రామా నడుపుతున్నారు. పోలీసులు, రవిని జీపులో కోర్టుకు తీసుకెళ్లకుండా గంట సేపటి నుంచి ఊరంతా తిప్పుతున్నారు. మీడియా, వైఎస్సార్‌సీపీ నేతల కళ్లబడకుండా ఏలూరు వీధుల్లో, సందుల్లో నాటకీయంగా తిప్పుతూ టీడీపీకి అనుకూలంగా డ్రామాలాడుతున్నారు. పోలీసుల వైఖరితో రవి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top