హైదరాబాద్ లో సమైక్యశంఖారావం-జగన్ | ys jagan meets governor assures that he will sign first on united resoulution | Sakshi
Sakshi News home page

Sep 30 2013 6:16 PM | Updated on Mar 21 2024 7:47 PM

కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని, కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి అన్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. లోటస్ పాండ్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు యథాతథంగా... * 16 నెలలుగా నేను జైలులో ఉన్నా కూడా తరగని ఆప్యాయతలతో అభిమానం చూపించిన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అన్న తమ్ముడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దేశంలోని అందరికీ, కేంద్రంలోని పెద్దలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం తెలుస్తుంది. నిజాయితీగా పని చేస్తున్న పార్టీలు కనిపించడం లేదు. * వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి మనసా వాచా కట్టుబడి ఉన్నాయి. మిగిలిన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఒక తండ్రిగా ఆలోచించి న్యాయం చేయాలి. తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ పార్టీలు అన్యాయం జరుగుతుందని అడగడంలేదు. * రాష్ట్రం సమైక్యంగా ఉన్న పరిస్థితులలోనే నీటి సమస్య ఉంది. మధ్యలో మరో రాష్ట్రం వస్తే నీరు సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించడంన్నారు. మంచి నీటి కోసం కొట్టుకునే పరిస్థితికి తీసుకువెళుతున్నారు.అన్ని జిల్లాల వారు నీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారు. రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు? * 50 శాతం బడ్జెట్ హైదరాబాద్ నుంచే వస్తోంది. దీనిని వదిలిపెడితే ఎలా? పదేళ్లలో మరో రాజధాని కట్టుకోవడం సాధ్యమేనా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. చదువు పూర్తి చేసిన పిల్లవాడు ఉద్యోగం చూసేది హైదరాబాద్ వైపే.60 శాతం మంది ప్రజలు అన్యాయం జరుగుతోందని రోడ్డు ఎక్కారు. ప్రజల మనసులలో కలసి ఉండాలన్న భావనను ఎవరూ తీసివేయలేరు. * సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్లో 15 -20 తేదీలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. నిజాయితో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. సమైక్యానికి కట్టుబడుతూ లేఖ రాయండి. మొదటి సంతకం నేను పెడతాను. ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి. ఇది మొదలు పెడితే నాలుగు, అయిదు పార్టీలుగా పెరుగుతాయి. అలా చేస్తేనే రాష్ట్రం విడిపోకుండా ఆపగలుగుతాము. ప్రతి రాజకీయ పార్టీని ప్రశ్నించండి. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వనప్పుడు సమైక్య ఉద్యమంలో ఎలా పాల్గొంటారని అడగండి. * కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ సీపీకి డీల్ ఉందని చంద్రబాబు అండ్ కో అంటున్నారు.. నిజంగా డీల్ ఉంటే మూడు నెలలలో రావలసిన బెయిలు రావడానికి 16 నెలల సమయం ఎలా పడుతుంది? రాజ్యాంగం ప్రకారం విచారణ పూర్తికాని పక్షంలో మూడు నెలల్లోనే బెయిలు రావాలి. * ఐఎంజి కేసులలో తనపై విచారణ జరగకుండా కోర్టుకు వెళ్లినది చంద్రబాబు కాదా? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏకంగా విప్ జారీచేసి ఆ తీర్మానం నెగ్గకుండా చేశాడు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు. ఒక మనిషి చనిపోయిన తరువాత కనీస ధర్మం కూడా లేకుండా కేసులు వేస్తారు. ఆర్టీఐ కమిషనర్ కూడా పదవులు పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement