‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాట ఇప్పుడు అదే జరుగుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు.