కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ విమర్శించారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన స్థానిక హరిత హోటల్ ను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిత హోటల్స్లో గతంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న గదుల అద్దెలను ఇప్పుడు ‘డైనమిక్ పాలసీ’ పేరుతో విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. విమాన టికెట్ల తరహాలో గంటగంటకు రేట్లు మారుస్తూ, ఉదయం రూ. 2వేలు ఉన్న గదిని మధ్యాహ్నానికి రూ. 4 వేలు వసూలు చేయడం పర్యాటకులను దోచుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక రంగంపై తనకు ఎంతో మక్కువ ఉందని చెప్పుకునే చంద్రబాబు, మరి ఆ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం ఆచరణలో శూన్యమని ఎద్దేవా చేశారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేయడం వల్ల వందలాది మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీని ప్రసన్నం చేసుకునే క్రమంలో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది మరోకటి ఇప్పటికై నా మాటలు కట్టిపెట్టి క్షేత్రస్థాయిలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై
సీపీఐ జాతీయ నేత
కె. నారాయణ ధ్వజం


