కడప సెవెన్రోడ్స్: నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల భాగస్వాములతో జలధార కార్యక్రమాల ప్రణాళికలను మరింత ప్రాధాన్యతతో పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ నోడల్ అధికారులు,మండల స్థాయి బృందాల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ‘జలధార.. జల హారతి, నీటి భద్రత– అమలు ప్రణాళికపై అన్ని మండలాల నోడల్ అధికారులు,ఎంపీడీఓలు,ఇరిగేషన్,డ్వామా అధికారులులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు మట్టాన్ని పెంపొందించడం,నీటి వనరులు సంరక్షణ,సాగునీటి వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించాలన్నారు. అందులో భాగంగా నీటి వనరులను గుర్తించడం నీటి భద్రత, సాగునీటి పొదుపు, కొత్త ఆయకట్టు మదుపు,వాగులు, చెరువుల అనుసంధానం, సూక్ష్మ సేద్యం,వర్షపు నీటిని ఒడిసి పట్టడం.. తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మే 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు గ్రామాల వారీగా వారి పరిధిలోని చెరువుల్లో వారి సొంత అవసరాలకు మట్టిని తోలుకోవచ్చని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ అబ్దుల్, గ్రౌండ్ వాటర్ డీడీ మురళీధర్, సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


